సహకార వ్యవస్థను పటిష్టం చేశాం
ABN , First Publish Date - 2022-09-30T05:16:29+05:30 IST
ప్రాథమిక సహకార వ్యవస్థను రాష్ట్రంలో పటిష్టం చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
- ధాన్యం కొనుగోళ్లతో ఆర్థికంగా బలపడ్డాయి
- వ్యాపారులకు రుణం ఇచ్చేలా రైతులు ఎదగాలి
- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి అర్బన్/గోపాల్పేట, సెప్టెంబరు 29: ప్రాథమిక సహకార వ్యవస్థను రాష్ట్రంలో పటిష్టం చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కాశీంనగర్లో నిర్వహించిన మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు సహకార సంఘాలకు అప్పగించిన తరువాత బలపడ్డాయన్నారు. ఆ కొనుగోళ్ల నుంచి వచ్చిన కమీషన్లతో సహకార సంఘాలు బలపడ్డాయన్నారు. సహకార వ్యవస్థను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని, సహకార రంగం అప్పులు ఇవ్వడానికి ఏర్పాటు చేయలేదన్నారు. అప్పుల ఊబి నుంచి రైతాంగాన్ని బయట పడేయడానికి ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారులకు రుణం ఇచ్చే స్థాయికి రైతులు ఎదగాలన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. అదేవిధంగా గోపాల్పేట మండలంలోని జయన్నతిర్మలాపూర్, మున్ననూరు, చాకల్పల్లి గ్రామాల్లో ఆయన ఆసరా, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలుచేస్తామని, ప్రతీ రైతుకు రైతుబంధు అందిస్తున్నామన్నారు. అనంతరం మున్ననూరు గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు కోసం రూ.7 లక్షలు మంజూరు చేస్తామన్నారు. చాకల్పల్లిలో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, ఎంపీపీ సంధ్య, జడ్పీటీసీ సభ్యురాలు భార్గవి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు తిరుపతియాదవ్, కోటీశ్వర్రెడ్డి, సర్పంచ్లు లక్ష్మీకళ, శేఖర్యాదవ్, నాయకులు పాల్గొన్నారు.