ప్రజలకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2022-05-15T05:33:25+05:30 IST

‘ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉంటాం. ప్రజాభిప్రాయానికి భిన్నంగా భావనపాడు పోర్టు నిర్మిస్తే ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రజలకు అండగా ఉంటాం
మాట్లాడుతున్న శ్రీనివాసరావు

- ప్రజాభిప్రాయానికి భిన్నంగా పోర్టు నిర్మిస్తే ప్రతిఘటన
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
కాశీబుగ్గ, మే 14:
‘ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉంటాం. ప్రజాభిప్రాయానికి భిన్నంగా భావనపాడు పోర్టు నిర్మిస్తే ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం సంతబొమ్మాళి మండలంలోని విష్ణుచక్రం, మూలపేట, పెద్దలింగూరు తదితర  పోర్టు నిర్మాణ ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడారు. అనంతరం కాశీబుగ్గలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ గ్రామాలను విడిచి వెళ్లలేమని పోర్టు నిర్మాణ గ్రామాల బాఽధితులు ముక్తకంఠంతో తెలియజేశారని చెప్పారు. ‘వారంతా చేపల వేట, కూలి పనులు చేసి జీవిస్తున్నారు. జీవనోపాధి దెబ్బ తీస్తే సహించేది లేదు. తొలుత భావనపాడు వద్ద పోర్టు నిర్మిస్తామని చెప్పి, ప్రస్తుతం విష్ణుచక్రం, మూలపేట, పెద్దలింగూరు గ్రామాల వైపు అలైన్‌మెంట్‌ మార్చడంపై అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పూర్వీకుల నుంచి అనుభవంలో ఉన్న భూముల్లో జీడితోటలు వేసుకొని, ఉప్పు పండించుకొని జీవనోపాధి పొందుతున్నామని, ఇప్పుడు అవి ప్రభుత్వ భూములు ఎలా అవుతాయని ఆయా గ్రామస్థులు ప్రశ్నిస్తున్నార’ని శ్రీనివాసరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజాభిప్రాయానికి భిన్నంగా పోర్టు నిర్మిస్తే ప్రతిఘటన తప్పదని స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ మత్య్సకార భరోసా అంటూ మత్య్సకారుల జీవనోపాధిని దెబ్బకొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, నాయకులు బి.కృష్ణమూర్తి, కె.మోహన్‌రావు, షణ్ముఖరావు, ఈశ్వరరావు, ఎల్లయ్య, గణపతి ఉన్నారు.

 

Updated Date - 2022-05-15T05:33:25+05:30 IST