ససీఐ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం

ABN , First Publish Date - 2022-01-27T09:12:35+05:30 IST

ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ససీఐ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం

ఆదిలాబాద్‌కు ఐటీ టవర్‌ మంజూరు చేస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పునరుద్ధరణ కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులు బుధవారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా కంపెనీ పునఃప్రారంభం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని పలుమార్లు కోరిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించారు. సీసీఐ పునఃప్రారంభానికి అవసరమైన అన్ని రకాల రాయితీలు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపామని గుర్తు చేశారు. అయితే, ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదన్నారు.  కాగా, త్వరలోనే ఆదిలాబాద్‌కు ఐటీ టవర్‌ను మంజూరు చేస్తామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సిదధం చేయాలని అధికారులను ఆదేశించారు.  


ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు బుధవారం ఆయనను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఆదివాసీ రైతుల అటవీశాఖ భూముల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. 

Updated Date - 2022-01-27T09:12:35+05:30 IST