దోచుకునే వాళ్లను నిలువరిస్తాం

ABN , First Publish Date - 2022-07-03T09:01:18+05:30 IST

దోచుకునే వాళ్లను నిలువరిస్తాం

దోచుకునే వాళ్లను నిలువరిస్తాం

రాష్ట్రాన్ని రాజకీయ క్రీడలకు బలికానివ్వం

జనసేన వీర మహిళలకు శిక్షణ తరగతుల్లో పవన్‌ కల్యాణ్‌


అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని వివిధ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేస్తోన్న ప్రభుత్వాన్ని జనసేన నేడు నిలదీస్తుంది... రేపు నిలువరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను రాజకీయ క్రీడలకు బలికానివ్వం. జనసేన వేదికగా అందరినీ ఏకం చేస్తాం’’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక వీర మహిళలకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న దోషుల్ని శిక్షించాలని కోరుతుంటే.. రాష్ట్ర హోం మంత్రి బాధ్యత లేకుండా తల్లుల పెంపకాన్ని తప్పుపట్టారు. ఒక మహిళయి ఉండి సాటి తల్లులను నిందిస్తూ, క్రిమినల్స్‌ను వెనకేసుకొస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. హోం మంత్రి పదవిలో ఉన్న ఆమె ఇలా మాట్లాడవచ్చా?’’ అని పవన్‌ ప్రశ్నించారు.  


ఆశ వైసీపీది.. ఆశయం జనసేనది 

‘‘ఆశ వైసీపీది అయితే.. ఆశయం జనసేనది. ఆశయం ఉన్నవాళ్లకు భూదేవి అంత ఓర్పు ఉంటుంది. అలాగని మా సహనాన్ని పరీక్షిస్తే భూకంపం ఎలా ఉంటుందో చవిచూస్తారు’’ అని పవన్‌ హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలు వినేందుకు కూడా తీరక లేదని విమర్శించారు. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య భవన్‌లో నిర్వహిస్తున్న జనవాణి... జనసేన భరోసా కార్యక్రమంలో తాను ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T09:01:18+05:30 IST