వారంలో ఓరోజు చేనేత వస్త్రాలను ధరించాలి

ABN , First Publish Date - 2022-08-08T05:11:09+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ అధికారులు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ సూచించారు. సిద్దిపేటలో ఆదివారం చేనేత ర్యాలీని జడ్పీ చైర్‌పర్సన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్‌ నుంచి హౌసింగ్‌ బోర్డు కమాన్‌ మీదుగా విపంచిహాలుకు చేరుకున్నది

వారంలో ఓరోజు చేనేత వస్త్రాలను ధరించాలి
సిద్దిపేట పట్టణంలో జెండా ఊపి చేనేత ర్యాలీని ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

చేనేత పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంది

నేతన్న బీమాతో కార్మిక కుటుంబాలకు ధీమా

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజాశర్మ


సిద్దిపేట రూరల్‌/సిద్దిపేట ఆగస్టు 7 : జిల్లాలోని ప్రభుత్వ అధికారులు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ సూచించారు.  సిద్దిపేటలో ఆదివారం చేనేత ర్యాలీని జడ్పీ చైర్‌పర్సన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్‌ నుంచి హౌసింగ్‌ బోర్డు కమాన్‌ మీదుగా విపంచిహాలుకు చేరుకున్నది. అనంతరం విపంచి కళానిలయంలో నిర్వహించిన చేనేత దినోత్సవ సంబరాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. చేనేత వస్త్రాలను ప్రతీ ఒక్కరు ధరించాలని, తద్వారా ఆదరణ లభిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన కృష్ణభాస్కర్‌ ప్రతీ సోమవారం చేనేత వస్త్రాలు ధరించేవారని గుర్తుచేశారు. అధికారులు ధరించడం ఇతరులకు స్ఫూర్తివంతంగా ఉంటుందన్నారు. నేతన్న బీమా పథకంతో అకాల మరణం చెందిన నేత కార్మికుని కుటుంబానికి ఒక ధీమాగా ఉంటుందని, ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, పద్మశాలి సమాజ రాష్ట్ర కన్వీనర్‌ బూర మల్లేశం, జిల్లా పద్మశాలి సమాజం అధ్యక్షుడు డాక్టర్‌ సతీష్‌, పట్టణ పద్మశాలి సమాజం అధ్యక్షుడు కాముని రాజేశం, ప్రాంతీయ సహాయ సంచాలకులు చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి సంతో్‌షకుమార్‌, వివిధ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శిలు, నేత కార్మికులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 


నేతన్నల సంక్షేమానికి కృషి : ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక, ఆగస్టు 7 : నేతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆయన దుబ్బాక నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో పలువురు చేనేత కార్మికులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాకే వృత్తిదారులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. చేనేత కార్మికులకు రైతు బీమా లాగే చేనేత బీమాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచితాలు వద్దనే ఉచిత సలహా ముఖ్యంగా చేనేత కార్మికులపైనే ప్రభావం చూపుతుందన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు వద్దని ఆదేశిస్తే, కనీసం పింఛన్‌ కూడా రాని పరిస్థితి నెలకొంటదన్నారు. కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్‌ రంగం మీద చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాకనే వ్యక్తిగత రుణాలను ఎత్తివేశామని, యారన్‌ సబ్సిడీని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ పుష్పలత, దుబ్బాక మున్సిపల్‌ చైర్మన్‌ గన్నెవనితా, తహసీల్దార్‌ అన్వర్‌, నీలకంఠ సంఘం సత్యానందం, బోడచందు తదితర నాయకులు పాల్గొన్నారు.


హుస్నాబాద్‌, కొమురవెల్లిలో 

హుస్నాబాద్‌/చేర్యాల, ఆగస్టు 7 : హుస్నాబాద్‌ పట్టణంలోని పద్మశాలి కాలనీ చేనేత సహకార సంఘం ఆవరణలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మన్‌బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకును కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజిత, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. కొమురవెల్లిలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురవెల్లి గ్రామవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌వైకే జిల్లా ప్రోగ్రాం అధికారి కిరణ్‌కుమార్‌, వలంటీర్‌ కటకం అమరేందర్‌, గోనె భాస్కర్‌, గోనె పవన్‌, తుమ్మ కృష్ణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:11:09+05:30 IST