అయ్యప్ప మాల ధరించి బడికొచ్చాడని..
ABN , First Publish Date - 2021-11-23T15:39:13+05:30 IST
అయ్యప్ప మాల ధరించి..
విద్యార్థిని మండుటెండలో నిలబెట్టిన ప్రిన్సిపాల్!
సదాశివపేట: అయ్యప్ప మాల ధరించి బడికెళ్లడమే ఆ విద్యార్థి తప్పయింది. అందుకు శిక్షగా మండుటెండలో నిలబడాల్సి వచ్చింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఓ విద్యార్థికి ఎదురైన అనుభవమిది. కిశోర్.. స్థానిక సెయింట్ మేరీస్ స్కూలులో పదో తరగతి చదువుతున్నాడు. తాజాగా అయ్యప్ప దీక్ష తీసుకుని నల్లరంగు దుస్తులు ధరించి సోమవారం స్కూలుకు హాజరయ్యాడు. ప్రిన్సిపాల్.. క్లాసులోకి అనుమతించలేదు. 40 నిమిషాల పాటు ఎండలో నిలబెట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థి కుటుంబసభ్యులు, బీజేపీ నాయకులు, అయ్యప్ప భక్తులు పాఠశాలకు చేరుకున్నారు. ఘటనపై ప్రిన్సిపాల్ను నిలదీశారు. యూనిఫామ్ లేకుండా వస్తే.. పాఠశాలలోకి అనుమతించేది లేదని ప్రిన్సిపాల్ తేల్చిచెప్పారు. దీంతో వారు నిరసనకు దిగారు. ఎట్టకేలకు దిగొచ్చిన యాజమాన్యం.. పంచెతో కాకుండా.. నల్ల ప్యాంటు ధరించి రావాలని చెప్పింది. ఇందుకు అందరూ అంగీకరించడంతో.. వివాదం సద్దుమణిగింది.