కల్యాణాలకు కరోనా గండం
ABN , First Publish Date - 2021-04-24T05:00:30+05:30 IST
కరోనా మహమ్మారి ప్రభావం మరోసారి వివాహాది శుభకార్యాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. 70 రోజులపాటు శుక్రమూడమి కొనసాగి మే 1వ తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మే 1 నుంచి ప్రారంభం కానున్న వివాహాల సందడి
ఇప్పటికే మండపాలు, ఈవెంట్లకు అడ్వాన్స్ల చెల్లింపు
కొవిడ్ విజృంభనతో పరిమిత సంఖ్యలోనే అనుమతులు ?
వేడుకల ఏర్పాట్లపై ప్రభావం
వివిధ వర్గాల ఉపాధికి గండి
గిద్దలూరు టౌన్, ఏప్రిల్ 23 : కరోనా మహమ్మారి ప్రభావం మరోసారి వివాహాది శుభకార్యాలపై తీవ్రమైన ప్రభావం చూపనుంది. 70 రోజులపాటు శుక్రమూడమి కొనసాగి మే 1వ తేదీ నుంచి ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ వేడుకలపై కూడా కరోనా ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కల్యాణ మండపాలు, విందు వినోదాలతోపాటు అనేక ఈవెంట్ల నిర్వహణకు లక్షల్లో అడ్వాన్సులు చెల్లించిన వారు ఇప్పుడు ఆగండి, కాస్త వేచి చూద్దాం అంటూ సందేశాలు ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా గత ఏడాది మార్చి మూడో వారం నుంచి కరోనా ఎఫెక్ట్తో 6 నెలలకు పైగా పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. తరువాత ముహూర్తాలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ఇక 2021 జనవరి 3వ వారం నుంచి శుక్రమూఢమి కారణంగా పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు వంటి వాటికి ముహూర్తాలు లేవు. ఇప్పుడు వైశాఖమాసంలో మే 1వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో ముందస్తుగానే వధూవరుల తల్లిదండ్రులు భారీగా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ఉన్న కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్లతోపాటు, షామియానాలు, పూలడెకరేషన్లు, వంటపనివారు, అనేక రకాల వారికి అడ్వాన్స్లు చెల్లించి ఖరారు చేసుకున్నారు. మే, జూన్ నెలల్లో పెద్దసంఖ్యలో ముహూర్తాలు ఉండడంతో కొన్ని వందల పెళ్లిళ్లకు నిర్ణయాలు జరిగాయి. గతంలో కరోనాతో వాయిదాపడ్డ పెళ్లిళ్లు సైతం ఈ ముహూర్తాల్లో అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నప్పటికీ కరోనా మరోసారి వారి పాలిట శాపంగా మారింది. మూఢంతో మూడు నెలలు మౌనంగా ఉన్న కరోనా ముహూర్తాలు ప్రారంభమయ్యే సమయానికి విజృంభించడం తమకు శాపంగా మారిందంటూ కల్యాణ మండపాల యజమానులతోపాటు వివిధ రకాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల రూపాయలు అడ్వాన్స్లు చెల్లించామని, తిరిగి ఇవ్వమన్నా వచ్చే పరిస్థితి లేదని వధూవరుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కరోనా నిబంధనలు పాటించాలంటూ అధికారులు ఆదేశిస్తుండడంతోపాటు కొన్నిచోట్ల లాక్డౌన్ నిబంధనలు అమలు చేయడం వల్ల పెళ్లిళ్లు ఎలా జరుగుతాయనే ఇరువర్గాల బంధుమిత్రుల్లో నెలకొన్నాయి. గత ఏడాది కరోనా పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడంతోపాటు ప్రస్తుతం తీవ్రరూపం దాల్చుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెళ్లిళ్లు నామమాత్రంగానే జరుపుకునేందుకు సిద్ధం కావలసిందిగా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తిరునాళ్ల, శ్రీరామనవమి వేడుకలు వంటివి రద్దు అయిన నేపథ్యంలో పెళ్లిళ్లపై కూడా కరోనా ఆంక్షలు తీవ్రప్రభావం చూపనున్న దృష్ట్యా వివాహ వేడుకలతో ముడిపడి ఉన్న అన్ని వర్గాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోసారి తామంతా నష్టపోవలసి వస్తుందంటూ ఆయా వర్గాల వారు ఆవేదన చెందుతున్నారు.