మోదీ గిఫ్ట్ కార్డు బయటికి తీశారు : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2022-03-13T19:58:08+05:30 IST

ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును నాలుగు

మోదీ గిఫ్ట్ కార్డు బయటికి తీశారు : మమత బెనర్జీ

కోల్‌కతా : ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ట స్థాయికి తగ్గించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక నిర్ణయమని మండిపడ్డారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ ప్రభుత్వం తక్షణమే గిఫ్ట్ కార్డును బయటికి తీసిందని ఆరోపించారు. 


మమత బెనర్జీ ఆదివారం వరుస ట్వీట్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తక్షణమే బీజేపీ ప్రభుత్వం తన గిఫ్ట్ కార్డును బయటికి తీసిందన్నారు. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాలనాటి స్థాయికి తగ్గించాలని ప్రతిపాదించడం ద్వారా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుందని ఆరోపించారు. 


కోవిడ్-19 మహమ్మారి వల్ల దేశంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ ప్రతిపాదన చేశారని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ అనాగరిక, క్రమ రహిత విధానాలను ఈ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చర్య బయటపెడుతోందన్నారు. రైతులు, కార్మికులు, మధ్య తరగతి వర్గాలవారిని పణంగా పెట్టి పెద్ద పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతిస్తోందని ఆరోపించారు. ఈ చీకటి చర్యలను సమైక్య నిరసనల ద్వారా తప్పనిసరిగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. 


ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటు 2020-21లో సంవత్సరానికి 8.5 శాతం ఉండేది. దీనిని 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.1 శాతానికి తగ్గించాలని శనివారం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్ణయించింది. 


Updated Date - 2022-03-13T19:58:08+05:30 IST