పదో తరగతి పరీక్షలు.. ఇంటర్నెట్ బంద్

ABN , First Publish Date - 2022-03-07T19:45:41+05:30 IST

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం పరీక్షల సందర్భంగా అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్స్ జరిగే ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది.

పదో తరగతి పరీక్షలు.. ఇంటర్నెట్ బంద్

ఈ రోజు నుంచి పశ్చిమ బెంగాల్‌లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు పకడ్బందీగా జరిగేందుకు ప్రభుత్వాలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మామూలే. అయితే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం పరీక్షల సందర్భంగా అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్స్ జరిగే ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఇంతకీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసా.. పరీక్షా పత్రం లీక్ కాకుండా ఉండేందుకు. ఔను.. ఎగ్జామ్స్ పేపర్ లీక్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనుంది. గతంలో జరిగిన పొరపాట్ల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 


2019, 2020లలో జరిగిన పదో తరగతి పరీక్షల సందర్భంగా, కొన్ని ఎగ్జామ్స్ సెంటర్స్ నుంచి గంటసేపటికి ముందే ప్రశ్నాపత్రాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇవి సోషల్ మీడియా సర్కిల్స్‌లో విపరీతంగా షేర్ అయ్యాయి. అందుకే ఈసారి ఇలాంటి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో, ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇంటర్నెట్ నిలిపివేయాలని నిర్ణయించారు. పరీక్షలు జరిగే 7, 8, 9, 11, 12, 14, 16 తేదీల్లో, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.15 నిమిషాల వరకు ఇంటర్నెట్ నిలిచిపోతుంది. అది కూడా పరీక్షలు జరిగే ప్రాంతాల్లోనే. అయితే, కాల్, ఎస్సెమ్మెస్ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2022-03-07T19:45:41+05:30 IST