కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన మంత్రి!

ABN , First Publish Date - 2020-11-27T00:14:55+05:30 IST

కరోనా వ్యాక్సీన్ పరిశోధనల్లో భాగంగా కోల్‌కతాలోని ఎన్ఐసీఈడీలో నిర్వహించనున్న కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ కోసం వాలంటీర్‌గా...

కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చిన మంత్రి!

కోల్‌కతా: కరోనా వ్యాక్సీన్ పరిశోధనల్లో భాగంగా కోల్‌కతాలోని ఎన్ఐసీఈడీలో నిర్వహించనున్న కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ కోసం వాలంటీర్‌గా ఉండేందుకు పశ్చిమ బెంగాల్ మంత్రి పిర్హద్ హకీమ్ ముందుకొచ్చారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్న 62 ఏళ్ల హకీం... ఇప్పటికే ఎన్ఐసీఈడీ అధికారులతో మాట్లాడారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నట్టు వారికి తెలియజేశారు. ‘‘నేను ప్రజలకు తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. నేను చేసే ఈ పని వల్ల ప్రజల చికిత్సకు మేలు జరుగుతుందంటే.. నాకు అంతకు మించిన సంతోషం మరోటి లేదు..’’ అని హకీం ఈ సందర్భంగా పేర్కొన్నారు.


ఇప్పటికే అధికారులకు తన సమ్మతిని తెలియజేశాననీ.. తాను కొవాగ్జిన్ ఫేజ్-3 ట్రయల్స్‌కు ఫిట్ అవుతానో లేదో తెలుసుకునేందుకు అధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారని ఆయన పేర్కొన్నారు. కొవాగ్జిన్ ట్రయల్స్ కోసం హకీం స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్ (ఎన్ఐసీఈడీ) అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ట్రయల్స్‌కు సుముఖత వ్యక్తం చేసిన కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) బోర్డు సభ్యుడు అతిన్ ఘోష్‌కు కూడా అధికారులు ఆహ్వానం పలికారు. కాగా త్వరలో ఎన్ఐసీఈడీలో జరిగే కొవాగ్జిన్ మూడోదశ ట్రయల్స్‌ కోసం కనీసం వెయ్యి మంది వాలంటీర్లు అవసరం అవుతారని అధికారులు తెలిపారు. 


Updated Date - 2020-11-27T00:14:55+05:30 IST