మూడోసారి పొడిగించారు..

ABN , First Publish Date - 2021-01-22T05:38:56+05:30 IST

సహకార సంఘాలకు నామినేట్‌ చేసిన త్రిసభ్య కమిటీలను మూడోసారి పొడిగించారు..

మూడోసారి పొడిగించారు..

సహకార సంఘాల త్రిసభ్య కమిటీల గడువు పెంపు..

పదవులు నామినేట్‌ చేసి 18 నెలలు 

సొసైటీలకు ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్లు..

భీమవరం, జనవరి 21 : సహకార సంఘాలకు నామినేట్‌ చేసిన త్రిసభ్య కమిటీలను మూడోసారి పొడిగించారు.. ఇప్ప టికే కమిటీలు ఏడాదిన్నర కాలపరిమితి పూర్తి చేసుకున్నాయి. గతేడాది రెండు దఫాలుగా ఈ కమిటీలను ప్రభుత్వం పొడిగించింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా త్రిసభ్య కమిటీలను పొడిగిస్తూ జీవో నెం.23 ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధనరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. సహకార సంఘాలకు 2019 జూలై 30న అధికార పార్టీకి చెందిన వారిని త్రిసభ్య కమిటీగా నియమించారు. ఒక్కో సొసైటీకి చైర్మన్‌, ఇరువురు సభ్యులను నియమించారు. తొలుత ఈ కమిటీలకు ఆరు నెలలు గడువు పెట్టారు. అదే ఏడాది డిసెంబరు నెలలో మళ్లీ పొడిగించారు. గతేడాది మళ్లీ జూలై నుంచి ఆరు నెలలు పొడిగించారు. ఇలా ఈ కమిటీల కాల పరిమితి 18 నెలలు పూర్తయ్యింది. ఈ సారి మరో నాలుగు నెలలు పొడిగించారు. 


ఎనిమిదేళ్లుగా ఎన్నికలు లేని సహకారం 

సహకార సంఘాలకు ఎన్నికలు జరిగి ఎనిమిదేళ్లు అవు తోంది. నిబంధనల ప్రకారం వీటికి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలి. సహకార పరపతి అందజేయడం, బీమా సౌక ర్యం, ధాన్యం కొనుగోళ్లు, విత్తనాలు,ఎరువులు విక్రయాలను సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయి. సొసైటీలో సభ్యులుగా ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్‌, పాలక సభ్యులుగా గెలుస్తారు. జిల్లాలో 257 సహకార సంఘాలు ఉన్నాయి. డీసీసీబీ ఆదేశాల మేరకు సొసైటీలు రైతులకు రుణాలు ఇస్తు న్నాయి. 2014లో రాష్ట్రం విడిపోయిన తరువాత ఇంత వరకు సహకార ఎన్నికలు జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఎన్నికలు జరిగాయి. ఆ కమిటీలను గత టీడీపీ ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగించింది అధికారం చేపట్టిన వైసీపీ 2019లో త్రిసభ్య కమిటీలను అధికార పార్టీ సభ్యులతో నియమించారు. ఆ కమిటీల కాలపరిమితి పొడిగిస్తూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ త్రిసభ్య కమిటీలతో అన్నదాతలకు కొత్తగా ఒరిగిందేమీ లేదంటున్నారు. నామినేటెడ్‌ కమిటీలు కావడంతో చట్టపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.అధికార దర్పం, పెత్తనం ప్రదర్శించడానికే పదవులు అన్నట్టుగా మారిందని అంటున్నారు.  

Updated Date - 2021-01-22T05:38:56+05:30 IST