మూడు మీటర్ల దూరం ఉండాల్సిందే..
ABN , First Publish Date - 2022-09-24T05:32:53+05:30 IST
పంట కాల్వలను ఆనుకొని చేపల, రొయ్యల చెరువుల గట్లు ఉండకూడదు.. నిబంధనల ప్రకారం మూడు మీటర్లు దూరంలో ఉండాల్సిందేనని ఏపీ వ్యవసాయ మిష న్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు.
రొయ్యలు, చేపల చెరువుల నీటిని పంట కాల్వల్లోకి వదిలితే చర్యలు
జిల్లా వ్యవసాయ సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరిక
ధాన్యం అమ్మిన సొమ్ము రావడం లేదంటూ వైసీపీ రైతుల ఫిర్యాదులు
భీమవరం, సెప్టెంబరు 23 : పంట కాల్వలను ఆనుకొని చేపల, రొయ్యల చెరువుల గట్లు ఉండకూడదు.. నిబంధనల ప్రకారం మూడు మీటర్లు దూరంలో ఉండాల్సిందేనని ఏపీ వ్యవసాయ మిష న్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఆక్వా పేరుతో అనుమతి లేకుండా రొయ్యల సాగు చేస్తు న్న వారిని గుర్తించి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల భాగస్వామ్యపక్షాల ముఖాముఖి చర్చ కార్యక్రమం భీమవరం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో శుక్రవారం జేసీ జేవీ మురళి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాగిరెడ్డి మాట్లాడుతూ చేపల చెరువులకు లైసెన్స్లు జారీ, ఎండా ర్స్మెంట్ సమయాల్లో నగదు డిమాండ్ చేస్తున్నరనే ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. నీటిపారుదలకు ఆటంకం లేకుండా తూడు తొలగింపునకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. కౌలు రైతుకు సీసీఆర్సీ కార్డుల జారీకి భూ యజమానులు సహకరించాలన్నారు. జేసీ మురళి మాట్లాడుతూ రొయ్యల చెరువులోని సెలైన్ వాటర్ పంట కాల్వలకు వదిలితే చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. కాల్వ గట్లే చెరువుగట్టుగా ఉన్నాయన్న రైతుల ఫిర్యాదుపై స్పందిస్తూ మత్స్యశాఖ, నీటిపారుదలశాఖ అధికారులతో తనిఖీలు చేయించి చర్యలు తీసు కుంటామన్నారు. రైతుల వద్ద నుంచి నగదు డిమాండ్ చేస్తున్నట్టు ఫిర్యాదులందితే ఉద్యోగులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
కలుషితంపై రైతుల ఫిర్యాదులు..
పలువురు రైతులు మాట్లాడుతూ రొయ్యలు, చేపల చెరువుల నుంచి నీటిని పంట కాల్వలకు వదలడం వల్ల పంటలు పండక వ్యవసాయాన్ని వదులుకోవల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. తాగునీటి వనరుల కలుషితం వల్ల తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామన్నారు. డ్రెయిన్లు ఆక్రమణకు గురై నీటి పారుదలకు ఇబ్బంది ఏర్పడిందన్నారు. అధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ అనుబంధ శాఖల జిల్లా అధికారులు ఆయా శాఖల్లో చేపట్టిన కార్యక్రమాలపై జిల్లా అధికారులు వివరించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ సభ్యుడు కె.రామారావు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు కైగాల శ్రీనివాసరావు, బి.సుబ్బారావు, ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.యుగంధర్బాబు, ఫిష్ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యదర్శి జీకేఎఫ్ సుబ్బరాజు, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎంచంద్రశేఖర్రెడ్డి, వ్యవసాయ సలహా మండలి సభ్యుడు కె.కుటుంబరావు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, జిల్లా వాటర్ రిసోర్స్ అధికారి పి.నాగార్జున, జిల్లా మత్స్యశాఖ అధికారి కేఎస్వీ నాగలింగాచార్యులు, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎ.రామ్మోహన్రావ, రైతులు, వ్యవసాయ పరిశోధకులు, పలువురు వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం సొమ్ము రావడం లేదు సార్..
వైసీపీ రైతుల ఫిర్యాదు
రైతు భరోసా ధాన్యం అమ్మిన నగదు తమకు జమ కాలేదని కొందరు వైసీపీ రైతులు సమావేశంలో నాగిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జాయింట్ కలెక్టర్ అధికారులతో మాట్లాడి వివరణ తీసుకుని బకాయిలు విడుదలకు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఇంకా 828 మంది రైతులకు సుమారు రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉండగా, వారిలో కొందరు రైతులు చేపల చెరువుల్లో, కుంటల్లో సాగు చేసిన పంటగా గుర్తిం చారన్నారు. అయినా రైతుల మేలుకోరి మిల్లర్లు ద్వారా చెల్లించేందుకు మాట్లాడమన్నారు. మిగిలిన ధాన్యం బకాయిలను రానున్న వారంలో రైతుల ఖాతాలలో జమ చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.