రెండెకరాలు గ్యారెంటీ ఇస్తేనే..
ABN , First Publish Date - 2021-04-21T05:37:30+05:30 IST
రైతులకు వ్యవసాయ ఉపకరణాలు అందించాలన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్స్ బాలారిష్టాలను దాటలేదు.
రైతులకు రుణాల మంజూరులో డీసీసీబీ జాప్యం
కస్టమ్ హైరింగ్ సెంటర్స్కు బాలారిష్టాలు
తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యవసాయ ఉపకరణాలు అందించాలన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్స్ బాలారిష్టాలను దాటలేదు. ప్రతి సెంటర్లో ఐదుగురు రైతులను గ్రూపుగా ఏర్పాటు చేసి గరిష్టంగా రూ.15 లక్షల విలువైన వ్యవసాయ ఉపకరణాలు రాయితీ పై అందజేయాలని భావించింది. ఇందులో రూ.1.50 లక్షలు గ్రూపు రైతులు చెల్లిస్తే మరో రూ.6 లక్షలు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మిగిలిన రూ.7.50 లక్షలు డీసీసీబీ రుణం మంజూరుచేస్తుంది. వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లు, పవర్ టిల్లర్స్ వంటి ఉపకరణాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతులను ఎంపికచేశారు. అయితే వీటి సరఫ రాకు డీసీసీబీ కొర్రీలతో అవాంతరం ఏర్పడింది. రెండెకరాల భూమిని గ్యారంటీగా ఇస్తేనే గ్రూపునకు రూ.7.50 లక్షల రుణం ఇస్తామని స్పష్టం చేస్తోంది. మరో వైపు గత ప్రభుత్వ హయాంలో రైతు రథం పథకం కింద మంజూరు చేసిన ట్రాక్టర్ లకు రూ.40 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో మళ్లీ కొత్తగా మంజూరు చేసేం దుకు కంపెనీలు వెనుకంజ వేస్తున్నాయి. ఈ సొమ్ములు చెల్లిస్తేనే ఇస్తామని స్పష్టం చేస్తు న్నాయి. ప్రభుత్వం సంప్రదింపులు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇది కూడా కస్టమ్ హైరింగ్ సెంటర్స్కు అడ్డంకిగా మారింది. ఈ సమస్యలతో ఏడాదిగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఆచరణలోకి రావడం లేదు. రుణాల మంజూరులో గ్యారంటీ లేకుండా ఉండేందుకు డీసీసీబీతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది.