ఏదీ పీజీ ఫీజుల రీయింబర్స్
ABN , First Publish Date - 2021-06-21T05:44:07+05:30 IST
చదువు ముగించుకుని ఉద్యోగంలో స్థిరపడాలన్న ఆశ తో వారంతా ముందుకు సాగారు.
జిల్లాలో పెండింగ్ బకాయిలు రూ.40 కోట్లు
చెల్లించకపోవడంతో విద్యార్థుల ఇక్కట్లు
సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాలలు
(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)
చదువు ముగించుకుని ఉద్యోగంలో స్థిరపడాలన్న ఆశ తో వారంతా ముందుకు సాగారు. అనుకున్నట్టే చదువు పూర్తయ్యింది. చేతికి సర్టిఫికేట్ మాత్రం రాలేదు. పెద్ద మొత్తంలో విద్యార్థులు ఫీజులు బకాయిలు పడటంతో వాటిని చెల్లిస్తే గాని కళాశాలల్లో సర్టిఫికేట్లు పొందే అవ కాశం లేదు. జిల్లాలో ఇలా వేలాది మంది పీజీ అభ్యర్థులు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో కొట్టు మిట్టాడుతున్నారు. కళాశాలలకు ఫీజులు చెల్లిస్తేనే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు (నోడ్యూస్) మంజూరుచేస్తాయి. విశ్వ విద్యాల యం నుంచి సర్టిఫికేట్లు పొందే అవకాశం ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో 2018–19, 2020–21 విద్యా సంవత్సరాలకు సంబంధించి కళాశాలలకు జిల్లా లో ప్రభుత్వం రూ.40 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చేయలేదు. ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందన్న భరోసాతో కళాశాలలు సర్టిఫికేట్లు మంజూరుచేసేవి. విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగాలు పొందేవారు. ఇప్పుడా పరిస్థితి తల్లకిందులైంది. సర్టిఫికేట్ వస్తుందో లేదోనన్న ఆందోళనలో ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎం.ఫార్మసీ విద్యార్థులు ఉన్నారు. సర్టిఫి కేట్లు లేనిదే ఉద్యోగాలు లభించవు.
హామీలు గాలికి..
సీఎం జగన్ ఎన్నికల ముందు విద్యార్థులకు లెక్కకు మిక్కిలి హామీలిచ్చారు. ఎంత వరకైనా ఉచితంగానే చది విస్తామని చెప్పారు. ఒక్క ఏడాదిపాటే ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకుంది. 2020–21 నుంచి పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేది లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. అప్పటినుంచి విద్యార్థులంతా ముందుగానే ఫీజులు చెల్లించుకుని పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. కళా శాలల యాజమాన్యాలు ఇప్పుడు బకాయిల కోసం ఎదురుచూస్తున్నాయి. వాస్తవానికి బీటెక్, బీఎస్సీ, బి.ఫార్మసీ, బి.కామ్ విద్యార్థులకు సైతం ఏడాది తర్వాత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తూ వస్తోంది. గతేడాది బకాయిలకు సంబంధించి మూడు నెలల ఫీజును ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. వచ్చే నెలలో మరో మూడు నెలల బకాయిలను విడు దల చేయనుంది. ఏడాది తర్వాత అయినా ఫీజులు వస్తుండడం కళాశాలలకు, విద్యార్థులకు ఊరటనిస్తోంది. అయితే తల్లిదండ్రుల ఖాతాలో సొమ్ము జమ చేస్తున్నారు. ఆ తర్వాత విద్యార్థుల నుంచి కళాశాలలు వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కళాశాలలకు ఫీజులు చేరా లంటే మరింత జాప్యం జరుగుతోంది. గ్రాడ్యుయేట్ కోర్సుల విషయంలో కళాశాలలు ఇటువంటి సమస్య ఎదు ర్కొంటున్నాయి. పోస్ట్గ్రాడ్యుయేట్లో బకాయిలు రాక విలవిల్లాడిపోతున్నాయి. అంతిమంగా ఇది విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.