తగ్గుతున్న గోదారి
ABN , First Publish Date - 2021-07-27T05:33:35+05:30 IST
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.6 అడుగులకు తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు.
ముంపులో నిర్వాసిత గ్రామాలు
వరద నీటిలో పట్టిసీమ ఆలయం
కనకాయలంకకు రెండు పడవలు
పోలవరం/యలమంచిలి జూలై 26 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 34.6 అడుగులకు తగ్గడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. సోమవారం సాయంత్రానికి ఎగువ కాఫర్ డ్యాం వద్ద 33.920 మీటర్లు, స్పిల్వే ఎగువన 32.507 మీటర్లు, స్పిల్వే దిగువన 32.10 మీటర్లు పోలవరం బోటు పాయింటు వద్ద 22.797 నీటిమట్టం నమోదైంది. పోలవరంలో గోదావరి నీట్టిమట్టం పెరగటంతో కడెమ్మ స్లూయిజ్గేట్లు పూర్తిగా మునిగిపోయాయి. కడెమ్మ వంతెనను తాకుతూ గోదావరి జలాలు ప్రవహి స్తున్నాయి. పట్టిసీమ వీరేశ్వరస్వామి ఆలయం చుట్టూ గోదావరి వరద జలాలు ఆక్రమించాయి. పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న ముంపు గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. తల్లవరం, గాజు గొంది, పెద్దూరు, వాడపల్లి గ్రామాల ప్రజలు సమీపంలో ఉన్న కొండలపై, గుట్టలపై వేసుకున్న తాత్కాలిక నివాసాల్లోకి చేరుకున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. నిత్యా వసరాలు, దోమల కాయిల్స్, జనరేటర్లలో వాడేందుకు ఆయిల్, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో కొన్నిచోట్ల సమస్యలు పరిష్కారం అయినప్పటికీ మరికొన్ని చోట్ల ఎలాంటి సౌకర్యాలు అందక ఇబ్బందులకు గురయ్యారు. ఆయా గ్రామాలకు నిత్యావసరాలు, సోలార్ లైట్లు,బరకాలు కూడా ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు.గోదావరి వరద సోమవారం సాయంత్రానికి నిలకడగా ఉంది. కనకాయలంక కాజ్వే నీట మునగడంతో పడవలపై ప్రయాణిస్తున్నారు. అధికారులు రెండు పడవలను ఏర్పాటు చేశారు. యలమం చిలి మండలంలోని దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం, యలమంచిలి, చించినాడ గ్రామాల్లోని పుష్కర ఘాట్లు నీట మునిగాయి.