ఆటలాడుతూ మృత్యుఒడికి..

ABN , First Publish Date - 2022-09-23T05:30:00+05:30 IST

సీసలిలో శుక్రవారం ప్రమాదవశాత్తు చెరువులో పడి అన్నాచెల్లెలు మృతి చెందారు.

ఆటలాడుతూ మృత్యుఒడికి..
మృతి చెందిన చిన్నారులు

సీసలి చెరువులో పడి చిన్నారుల మృతి
ఇద్దరు బిడ్డలను కోల్పోయి.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు

కాళ్ళ,  సెప్టెంబరు 23 : సీసలిలో శుక్రవారం ప్రమాదవశాత్తు చెరువులో పడి అన్నాచెల్లెలు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈవిషాద ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలివి.. గ్రామంలో పశువుల చెరువును అనుకుని చిప్పాడ సుబ్రహ్మణ్యం, కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చందు (6), లిఖిత (4) పిల్లలు ఉన్నారు. చందు ప్రైవేటు స్కూల్లో ఒకటో తరగతి, లిఖిత గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రా నికి వెళ్తున్నారు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం శుక్రవారం విధులకు వెళ్లాడు. తల్లి కుమారి తన అత్తగారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆస్పత్రి పనిమీద ఏలూరు వెళ్లింది. ఇంటి దగ్గర ఎవరూ లేని సమయంలో చిన్నారులు ఇద్దరూ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. సాయంత్రం సమయంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనబడకపోవడంతో చుట్టుపక్కల వెదికారు. చివరకు ఇంటి సమీపంలోని చెరువులో మృతదేహాలు కన్పించాయి. విగతజీవులై పడి ఉన్న చిన్నారులను చూసిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమకు ఎటువంటి సమాచారం అందలేదని కాళ్ళ పోలీసులు తెలిపారు.  

Updated Date - 2022-09-23T05:30:00+05:30 IST