ఇంటి నుంచి.. బయటకు వచ్చేదెలా..?
ABN , First Publish Date - 2021-01-17T05:48:56+05:30 IST
అధికారుల బాధ్యతారాహిత్యం ప్రజలకు శాపంగా మారింది.
ఏలూరు రూరల్, జనవరి 16 : అధికారుల బాధ్యతారాహిత్యం ప్రజలకు శాపంగా మారింది. గ్రా మంలో డ్రెయినేజీ నిర్మాణానికి సుమారు రెండు కిలోమీటర్లు మేర ఇళ్ల పక్క నుంచి ఉన్న డ్రెయిన్ ను తవ్వేసి వదిలేయడంతో ఇళ్లలో నుంచి బయటకు రావాలన్నా, వెళ్లాలన్నా ఫీట్లు చేయాల్సిన పరిస్థితి. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రూరల్ మండలం శనివారపుపేట పోస్టాఫీస్ వీధి నుంచి జిల్లా పరిషత్ హైస్కూలు వరకు గత నవంబర్లో డ్రెయిన్ నిర్మాణం పనులు చేపట్టారు. తొలుత పాత డ్రెయిన్ను పూర్తిగా తొలగించారు. కొద్ది మేర డ్రెయిన్ నిర్మాణం చేపట్టి మధ్యలో వదిలేశారు. దీంతో ప్రజలకు కష్టాలు ప్రారంభమ య్యాయి. డ్రెయిన్ల పైనుంచి మెట్లు నిర్మించుకున్న ప్రతి ఇంటి మెట్లు తొలగించి వేశారు. ప్రస్తుతం వాళ్ళు డ్రెయిన్ దాటేందుకు పాట్లు పడాల్సి వస్తోంది. డ్రెయిన్పై చెక్కలు అడ్డంపెట్టి జాగ్రత్తగా దిగాల్చి వస్తోంది. ఇలా సుమారు రెండు కిలోమీటర్ల మేర 50 పైగా ఇళ్లలో నివసించే వారిది ఇదే పరిస్థితి. ఇంట్లోకి వెళ్ళాలన్నా, రావాలన్నా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతు న్నారు. ఎందుకు ఆపేశారో తెలియడం లేదని డ్రెయినేజీ నిర్మాణం తమ ప్రాణాల మీదకు వచ్చిందని మండిపడుతున్నారు. మెట్లు కూడా తొలగించేయడంతో ప్రమాదవశాత్తు చాలామంది డ్రెయ్లిలో పడి గాయాల పాలయ్యారని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిలిపివేసిన డ్రెయిన్ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.