పగలు రెక్కీ.. రాత్రి చోరీ
ABN , First Publish Date - 2022-09-26T05:08:29+05:30 IST
ఉభయ గోదావరి జిల్లాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని తణుకు పోలీసులు ఆది వారం అరెస్టు చేశారు.
ముగ్గురు నిందితుల అరెస్టు.. రూ.33.56 లక్షల బంగారం, వెండి స్వాధీనం : ఎస్పీ
తణుకు, సెప్టెంబరు 25 : ఉభయ గోదావరి జిల్లాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని తణుకు పోలీసులు ఆది వారం అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ తణుకులో ఏర్పాటు చేసిన విలే కరులు సమావేశంలో తెలిపిన వివరాలివి.. ఇరగవరం మండలం సూరంపూడికి చెందిన బొల్లా వీర వెంకట సత్యనారాయణ, ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన నార్గన గోపాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన అంగర అంజిబాబు తాళాలు వేసి ఉన్న ఇళ్లను పగలు రెక్కీ నిర్వహించేవారు. అర్ధరాత్రి సమయాల్లో గునపంతో తాళాలు పగుల కొట్టి ఇంటిలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడేవారు. 2018 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి పర్యవేక్షణలో తణు కు రూరల్, పట్టణ సీఐలు సీహెచ్ ఆంజనేయులు, ముత్యాల సత్యనారాయణ, భీమవరం సీసీఎస్ సీఐలు ఆకుల రఘు, జీవీవీ నాగేశ్వరరావు కేసులను దర్యా ప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.33.56 లక్షల విలువైన 664.43 గ్రాముల బంగారు వస్తువులు, రెండు కేజీల77 గ్రాముల వెండి వస్తువు లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టులో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐలు ఆదినారాయణ, సంపత్, చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నరేశ్, అక్బర్ లాల్ లకు ఎస్పీ నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందించి అభినందించారు.