ట్రూ అప్ చార్జీల వసూళ్లు నిలిపివేత
ABN , First Publish Date - 2021-12-06T05:15:33+05:30 IST
విద్యుత్ వినియోగదారుల నుంచి ట్రూ అప్ చార్జీల వసూళ్లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రజల ఆందోళనలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
ఏలూరు సిటీ, డిసెంబరు 5 : విద్యుత్ వినియోగదారుల నుంచి ట్రూ అప్ చార్జీల వసూళ్లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014–15 నుంచి 2018–19 సంవత్స రాలకు సంబంధించి విద్యుత్ వినియోగానికి డిస్కంలకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేయటానికి వడ్డీతో సహా ట్రూ అప్ చార్జీలు, సర్ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ట్రూ అప్ చార్జీల వసూళ్లకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ట్రూ అప్ చార్జీల డిమాండ్ రూ.109.68 కోట్లు ఉండగా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో రూ.27.42 కోట్లు వసూలు చేశారు. ఈ వసూళ్లపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్టోబరు నుంచి వీటిని వసూలు చేయరాదని నిర్ణయించింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వసూలు చేసిన మొత్తాన్ని నవంబరు, డిసెంబరు నెలల విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు.