మాజీ ఎంపీ తనయుడు మాగంటి రాంజీ కన్నుమూత

ABN , First Publish Date - 2021-03-08T06:15:04+05:30 IST

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఏలూరు మాజీ ఎంపీ..

మాజీ ఎంపీ తనయుడు మాగంటి రాంజీ కన్నుమూత
మాగంటి రాంజీ

ఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) పెద్ద కుమారుడు రాంజీ(36) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నెల మూడో తేదీన అస్వస్థతకు గురైన ఆయన ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా అదేరోజు పరిస్థితి విషమించడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతిచెందారు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా మూడేళ్లుగా పనిచేశారు. చిన్న వయస్సులోనే జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు.


బాబు తర్వాత రాజకీయాల్లో ఆయన వారసుడిగా చురుగ్గా వ్యవహరిస్తున్న రాంజీ మృతి అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన కోలుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌తోపాటు జిల్లాలోని నాయకులు ఆకాంక్షించారు. మాగంటి బాబు కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. కానీ ఇంతలోనే రాంజీ మృతి చెందడం బాధాకరమని నేతలు వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు, అభిమానులు సంతాపం తెలిపారు. మృతదేహాన్ని సోమవారం ఏలూరులోని నివాసానికి తరలించనున్నారు. రాంజీకి వివాహం కాగా భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. 

Updated Date - 2021-03-08T06:15:04+05:30 IST