తడి, పొడిచెత్తను వేరు చేయాలి
ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST
తడి, పొడిచెత్తను వేరు చేయాలి
ఘట్కేసర్, మే 15 : తడి, పొడిచెత్తతో పాటు హానికరమైన చెత్తను ప్రత్యేక డబ్బాల్లో భద్రపరిచి మున్సిపాలిటీకి చెందిన ఆటోలలో వేయాలని పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని ఆయ్యప్యస్వామి ఆలయం నుంచి ఆటోలో తిరుగుతూ.. తడి, పొడిచెత్తపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ చెత్తను మున్సిపాలిటీకి చెందిన ఆటోల్లోనే వేయాలన్నారు. అలాకాకుండా వీధుల్లో, రోడ్లపక్కన చెత్తవేస్తే రూ.500 నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా తడి, పొడిచెత్తతోపాటు హానికరమైన చెత్తను వేర్వేరుగా భద్రపరిచి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రజల సహకారంతోనే మున్సిపాలిటీలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని అన్నారు. ఈక్రమంలో ముందుగా అందరికీ తడి, పొడిచెత్త నిర్వహణపై అవగాహన కల్పించి, అనంతరం జరిమానా విధించేందుకు తగిన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నర్సింహులు, రాఘవేందర్, రాజు, నాయకులు శేఖర్, జితేందర్, కేఎం రెడ్డి, మురళి, తిలక్, సంతోష్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.