కొల్లగొడుతూ.. ఎల్లలు దాటిస్తున్నారు !

ABN , First Publish Date - 2021-11-08T04:16:32+05:30 IST

ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, సీతారామపురం మండలా ల్లోని పలు ప్రాంతాల నుంచి యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ రవాణా జరుగుతున్నది.

కొల్లగొడుతూ.. ఎల్లలు దాటిస్తున్నారు !
అక్రమంగా తరలించేందుకు అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన తెల్లరాయి

అక్రమంగా తెల్లరాయి తరలింపు

కనిపించని అనుమతులు

ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు

పట్టించుకోని అధికారులు

ఉదయగిరి/వరికుంటపాడు, నవంబరు 7 : ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, సీతారామపురం మండలా ల్లోని  పలు ప్రాంతాల నుంచి యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ రవాణా జరుగుతున్నది. ఎలాంటి అనుమతుల్లేకుండా అటవీ, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్లో సైతం తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఆయా మండలాల్లో లభించే తెల్లరాయి సరిహద్దులు దాటుతోంది.

ప్రభుత్వాదాయానికి గండి

కొన్నేళ్లుగా ఆయా మండలాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తెల్లరాయి వ్యాపారంతో ప్రభుత్వాదాయానికి గండి పడుతోంది. ఒక్కో లారీ తెల్లరాయి రూ.1.50 నుంచి రూ.2.00 లక్షల వరకు ఉంటుంది. ఇలా వారానికి పదుల సంఖ్యలో  తెల్లరాయి లారీలు, టిప్పర్ల ద్వారా రాత్రిళ్లు ఎల్ల లు దాటుతోంది. మరికొన్నిచోట్ల తెల్లరాయి పెద్దపెద్ద గుం డ్లను ఎక్స్‌కవేటర్లతో పెకలించి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా రహ స్య ప్రదేశానికి తరలించి అక్కడ గూడూరు, వెంకటగిరి ప్రాంతాల నుంచి కూలీలను తీసుకువచ్చి  తెల్లరాయిని నాణ్యంగా మలుస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా రవాణా

దుత్తలూరు మండలం కమ్మవారిపాళెం, ఏరుకొల్లు, బోడవారిపల్లి, భైరవరం, జంగాలపల్లి, నర్రవాడ, వడ్డిపాళెం, రాచవారిపల్లి తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో  నూ, బ్రహ్మేశ్వరం వద్ద ఉన్న చెరువు, అటవీ భూముల్లోనూ, కట్టకిందపల్లి సమీపంలో పోరంబోకు భూముల్లోనూ తెల్లరాయి తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. అంతేకా క అసైన్డ్‌మెంట్‌ భూముల్లోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. కొన్నిచోట్ల అగ్రిమెంట్‌ భూముల లబ్ధిదారులకు తలమోఫ లమో ముట్టజెప్పి తరలిస్తున్నారు. ఉదయగిరి మండలం మాసాయిపేట, జీ.చెరువుపల్లి, బండ గానిపల్లి ప్రాంతాల్లో అర్థరాత్రి ఎక్స్‌కవేటర్లను ఉపయోగించి తవ్వకాలు జరిపి రాత్రికిరాత్రే టిప్పర్ల ద్వారా  తరలిస్తున్నారు. సీతారామపు రం మండలం బాలాయపల్లి, వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి, రామాపురం, తోటలచెరువుపల్లి, జడదేవి, కాంచెరువు, గువ్వాడి, నర్రవాడ, ఎర్రంరెడ్డిపల్లి, విరువూరు తదితర ప్రాంతాల్లో కూడా తెల్లరాయిని తొలగించి అక్రమంగా తరలిస్తున్నారు.

దాడులు శూన్యం

తెల్లరాయి తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నా అధికారుల దాడులు మాత్రం శూన్యం. అసైన్డ్‌ భూముల్లో జరుపుతున్న తవ్వకాల వల్ల భూములు ఎందుకు పనికిరా కుండా పోతున్నాయి. సంబంధిత అధికారులకు తెలిసినా, ప్రజలు సమాచారం ఇస్తున్నా  వారు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. 

అనుమతులు నిల్‌

ఎక్కడైనా తెల్లరాయి తవ్వకాలు జరపాలంటే రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అనుమతులు పొందిన తరువాతే తవ్వకాలు జరపాలి. అలాగే కూలీలకు లేబర్‌ చట్టం కింద కనీసం వేతనం చెల్లించడంతోపాటు ఎనిమిది గంటలు పని చేయించాలి. పనిచేసే చోట అన్ని సౌకర్యాలు కల్పించాలి. సేకరించిన తెల్లరాయిని తరలించాలన్నా అనుమతి తప్పనిసరి. ఇలాందేమీ లేకుండా ఆయా మండలాల్లో తెల్లరాయిని  అక్రమార్కులు తరలిస్తున్నారు. 

చెక్‌పోస్టులు ఉన్నా..

నియోజకవర్గంలోని దుత్తలూరు సెంటర్‌లో మార్కెటింగ్‌ చెక్‌పోస్టుతోపాటు అటవీశాఖ చెక్‌పోస్టు ఉంది.  ఆ శాఖ సిబ్బంది వీలున్న సమయంలో వచ్చి సంతకాలు చేసి పోతుంటారు. అటవీ, పోలీసు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే తెల్లరాయి అక్రమ వ్యాపారానికి చెక్‌పెట్టవచ్చని పలువురు అంటున్నారు.


Updated Date - 2021-11-08T04:16:32+05:30 IST