చిన్నారుల సంగతేంటి?

ABN , First Publish Date - 2021-05-07T04:30:07+05:30 IST

కరోనా సెకెండ్‌వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఇంటర్‌ చదువుతున్న పిల్లల వరకు అందరికీ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం... అంగన్‌వాడీ కేంద్రాలను మాత్రం నడుపుతోంది. చిన్నారుల పట్ల నిర్లిప్తంగా ఉంటోందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేంద్రాలకు పంపిస్తున్నా కాస్త బెరుకుతోనే ఉంటున్నారు.

చిన్నారుల సంగతేంటి?

అంగన్‌వాడీలకు సెలవులు ప్రకటించని ఐసీడీఎస్‌

ఆందోళన చెందుతున్న పిల్లల తల్లిదండ్రులు

అనేక కేంద్రాల్లో అరకొరగా పిల్లల హాజరు

(విజయనగరం - ఆంధ్రజ్యోతి)

కరోనా సెకెండ్‌వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఇంటర్‌ చదువుతున్న పిల్లల వరకు అందరికీ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం... అంగన్‌వాడీ కేంద్రాలను మాత్రం నడుపుతోంది. చిన్నారుల పట్ల నిర్లిప్తంగా ఉంటోందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేంద్రాలకు పంపిస్తున్నా కాస్త బెరుకుతోనే ఉంటున్నారు. కొందరైతే పూర్తిగా పంపడం లేదు. ఈ కారణంగానే చాలా అంగన్‌వాడీ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పదిరోజుల కిందటే సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులకు కూడా సెలవులిచ్చింది. ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసింది. డిగ్రీ, పీజీ, డిప్లమో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు జరుగుతున్నాయి. కానీ పూర్వ విద్యా కేంద్రాలుగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. తూతూ మంత్రంగా నడిపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించి ఆ పిల్లలకు డ్రై సరుకులు పంపిణీ చేయాలి. గత ఏడాది పెద్దగా కేసులు లేకపోయినా ముందుచూపుతో కొద్ది నెలల పాటు ఇదే విధంగా సరుకులు అందజేశారు. హాస్టల్‌ విద్యార్థులకు కూడా సరుకులు ఇళ్లకు ఇచ్చారు. సెకెండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న ఈ సమయంలో కేంద్రాలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు పెరుగుతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఇష్టం లేకపోయినా అంగన్‌వాడీ వర్కర్లు, ఆయాలు కేంద్రాలను ప్రతిరోజూ తెరుస్తున్నారు. పిల్లలను మాత్రం చాలా మంది తల్లిదండ్రులు పంపించడం లేదు. దీంతో కేంద్రాలు బోసిపోతున్నాయి. 

జిల్లాలో 1,479 అంగన్వాడీ కేంద్రాలు, మరో 559 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 15,770 మంది గర్భిణులు, 16,572 మంది బాలింతలు ఉన్నారు. అలాగే 0 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 1,42,986 మంది ఉన్నట్లు స్ర్తీశిశు సంక్షేమ శాఖ  చెబుతోంది. వీరందరికీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, గుడ్లు అందిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో నెలకు ఒకసారి పౌష్టికాహారం అందించడం మేలని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. తద్వారా పిల్లలకు కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించనట్లవుతుందని తల్లిదండ్రుల వాదనగా ఉంది. స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ఆ దశగా ఆలోచించాల్సి ఉంది.



Updated Date - 2021-05-07T04:30:07+05:30 IST