Corona Third Wave కనుక వస్తే జరగబోయేది ఇదేనా.. కేవలం రెండ్రోజుల్లోనే..!

ABN , First Publish Date - 2021-05-19T19:48:25+05:30 IST

సైంటిస్టులు మరో భయంకరమైన వార్త చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో వేవ్ తప్పదంటూ బాంబు పేల్చుతున్నారు. అంతేకాదు మూడో వేవ్‌లో కరోనా బారిన పడిన వాళ్ల పరిస్థితి..

Corona Third Wave కనుక వస్తే జరగబోయేది ఇదేనా.. కేవలం రెండ్రోజుల్లోనే..!

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. గతేడాది కరోనా మొదటి వేవ్‌తో పోల్చుకుంటే ఇప్పటి పరిస్థితులు నరకాన్ని తలపిస్తున్నాయి. ఎటు చూసినా కరోనా పేషెంట్ల శవాల దిబ్బలే. అంత్యక్రియల కోసం స్మశానాల వద్ద క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో బెడ్లు కరువు. బెడ్లు దొరికినా ఆక్సిజన్ లభ్యతపై అనుమానాలు. ఇవన్నీ చూసి కరోనా సెకండ్ వేవ్ ఇంత భయంకరంగా ఉందేంటి? అని సామాన్యులు వణికిపోతున్నారు. ఇలాంటి సమయంలో సైంటిస్టులు మరో భయంకరమైన వార్త చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో వేవ్ తప్పదంటూ బాంబు పేల్చుతున్నారు. అంతేకాదు మూడో వేవ్‌లో కరోనా బారిన పడిన వాళ్ల పరిస్థితి రెండ్రోజుల్లోనే విషమించే అవకాశాలుంటాయని తేల్చిచెబుతున్నారు. దీనికి కారణాలేంటి? కరోనా థర్డ్ వేవ్‌ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి?.. శాస్త్రవేత్తలు చెప్తున్న విషయాలను ఒకసారి పరిశీలిస్తే..


ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న విధానం చూస్తుంటే థర్డ్ వేవ్ తప్పేలా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. అయితే ఈ మూడో వేవ్ ఎప్పుడు వస్తుంది? ఎంతకాలం కొనసాగుతుంది? అనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం భారత్‌లో చాలా కరోనా వేరియంట్లు విజృంభిస్తున్నాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది డబుల్ మ్యూటెంట్. దీనికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు బి.1.617. ఇది కేవలం భారత్‌లో మాత్రమే కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే యూకే, బ్రెజిల్, సౌతాఫ్రికా, అమెరికా దేశాల్లో కూడా ఈ వైరస్ వేరియంట్లు వెలుగుచూశాయి. 


మన దేశంలో పలు రాష్ట్రాల్లో వేరు వేరు వేరియంట్లు వెలుగు చూశాయి. వీటిలో బాగా చర్చకు వచ్చిన వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో కనిపించి కరోనా వేరియంట్. ఇది మామూలు వైరస్ కన్నా 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది.అయితే ఇది చాలా తక్కువ ప్రాంతాల్లోనే ప్రస్తుతానికి పరిమితమైంది. ఈ వేరియంట్లు కరోనా కొత్త స్ట్రెయిన్లను సృష్టిస్తున్నాయని వైద్యులు చేసిన పరిశోధనలో తేలింది. ఇలా జరగడం వల్ల రకరకాల విధానాల్లో మానవులను ఈ వైరస్ ఎటాక్ చేస్తోందని వైద్యులు చెప్పారు. ఇన్ని వేరియంట్లు ఉండటం వల్ల కరోనా థర్డ్ వేవ్ తప్పదని అంటున్నారు.


ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. కరోనా మొదటి వేవ్‌లో మనుషుల ఊపిరితిత్తులను నాశనం చేయడానికి వైరస్ 10 రోజుల సమయం తీసుకుంది. సెకండ్ వేవ్‌లో ఈ కాలం 5-7రోజులకు తగ్గిపోయింది. మూడో వేవ్ కనుక వస్తే 2 నుంచి 3 రోజుల్లోనే ఊపిరితిత్తులను వైరస్ నాశనం చేసి, బాధితులను ఐసీయూలో పడేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్న వేరియంట్ ఇదే పని చేస్తోందని స్పష్టం చేస్తున్నారు. ఈ వేరియంట్ సోకిన వారు 2-3 రోజుల్లోనే ఐసీయూకు చేరిపోతున్నారు. ఆ తర్వాత పరిస్థితులు విషమించి చనిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావం, కరోనా వేవ్స్‌పై అధ్యయనం చేస్తున్న కొంత మంది శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయం వెల్లడించారు. అదేంటంటే కరోనా మొదటి వేవ్‌లో వృద్ధులపై వైరస్ దాడి చేసింది. సెకండ్ వేవ్‌లో యువకులపై ఎక్కువ ప్రభావం పడింది. మూడో వేవ్ గనుక వస్తే ఇది పిల్లలను టార్గెట్ చేస్తుందనేది శాస్త్రవేత్తల వాదన.


భారతదేశ జనాభాలో 18 ఏళ్లలోపు వారే 30 శాతంపైగా ఉన్నారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి వీరికి కూడా వ్యాక్సిన్ తీసుకొస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చెప్తోంది.  కోవ్యాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ కూడా ఈ పనిలోనే ఉంది. వారి వ్యాక్సిన్ ట్రయల్ దశలో ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలో ఇప్పటి వరకూ ఫైజర్ కంపెనీ మాత్రమే 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ తయారు చేసింది. 12 ఏళ్లపైబడిన వారికి ఇవ్వొచ్చంటూ ఒక వ్యాక్సిన్ విడుదల చేసింది. దీనికి కెనడాలో అనుమతులు లభించాయి కూడా. అమెరికాలో కూడా దీనికి త్వరలోనే అనుమతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా మనదేశంలో కూడా చిన్నారుల కోసం వ్యాక్సిన్ తయారు చేయకపోతే కరోనా మూడో వేవ్‌ను తట్టుకోవడం కష్టమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Updated Date - 2021-05-19T19:48:25+05:30 IST