విద్వేష ప్రసంగాలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లోకూర్

ABN , First Publish Date - 2022-02-21T01:54:55+05:30 IST

దేశంలో ఇటీవల ఒక్కసారిగా పెరిగిన ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్

విద్వేష ప్రసంగాలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లోకూర్

న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల ఒక్కసారిగా పెరిగిన ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ మోహన్ లోకూర్ తీవ్రంగా స్పందించారు. ధర్మ సంసద్, ముస్లిం మహిళలను వేలం వేసేందుకు రూపొందించిన సుల్లీ డీల్స్, బుల్లీబాయ్ యాప్స్‌పైనా ఆయన మాట్లాడారు. ద్వేషపూరిత ప్రసంగం గురించి చట్టపరమైన అంశాలపైన, ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్న దానిపైనా సుదీర్ఘంగా మాట్లాడారు. 


ధర్మసంసద్ నుంచి జాతి ప్రక్షాళన లేదంటే మారణహోమానికి పిలుపు వచ్చిందని పేర్కొన్న లోకూర్.. విద్వేషపూరిత ప్రసంగాలు మారణహోమానికి దారితీస్తాయని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో ఇటీవల జరిగిన ఘటనలపై ఆయన మాట్లాడుతూ.. మూక హత్యలకు పాల్పడిన వ్యక్తులకు ఓ మంత్రి పూలమాలలు వేశారని అన్నారు. లించింగ్ కూడా హింసేనని, విద్వేష ప్రసంగాలు హింసకు దారితీస్తాయని అన్నారు. 


ఢిల్లీలో కేబినెట్ మంత్రి కాని ఓ మంత్రి ‘గోలీ మారో’ అని చెప్పి కేబినెట్ మంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఇలా అనడం చంపడానికి ప్రేరేపించడం కాకపోతే మరేంటని జస్టిస్ లోకూర్ ప్రశ్నించారు. ధర్మసంసద్‌ విషయం సుప్రీంకోర్టుకు వచ్చినంత వరకు ఎలాంటి చర్యలు లేవని, ఆ తర్వాత మాత్రం కొన్ని అరెస్టులు జరిగాయని అన్నారు.


అరెస్ట్ అయినవారు ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారని లోకూర్ తెలిపారు. మూక హత్యలకు పాల్పడిన వారికి ప్రభుత్వంలోని కొందరు పూలదండలు వేస్తున్నారని, దీనిని బట్టి విద్వేష ప్రసంగాలు సరైనవేనన్ని అభిప్రాయం మీలో ఉందని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వాక్ స్వాతంత్ర్యానికి సహేతుకమైన పరిమితి ఉండాలని జస్టిస్ లోకూర్ అభిప్రాయపడ్డారు.  

Updated Date - 2022-02-21T01:54:55+05:30 IST