ప్రతీకాత్మక చిత్రం
కొందరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలకే తట్టుకోలేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొందరైతే తనువు చాలించేందుకు కూడా వెనుకాడరు. చండీగఢ్లో ఓ యువతి చాలా సున్నిత మనస్కురాలు. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అని నిత్యం ఆలోచిస్తూ ఉండేది. అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమో గానీ తన తల్లికి ఓ లేఖ రాసింది. అమ్మా.. నాకు వేరే మార్గం లేదంటూ రాసి, చివరికి ఆమె చేసిన పని.. గ్రామస్తులందరినీ కంటతడి పెట్టించింది. అసలు ఏం జరిగిందంటే..
చండీగఢ్ నగరం బ్యూటిఫుల్ అనే ప్రాంతం సెక్టార్ 22లో నివాసం ఉంటున్న తరుశీఖ(22) అనే యువతి.. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఎంబీబీఎస్ విద్యనభ్యసిస్తోంది. సెక్టార్ 22లోని ఓ గదిలో ఉంటూ చదువుకుంటోంది. సోమవారం నుంచి కళాశాలలో రెండో సెషన్ ప్రారంభమైంది. అయితే గత సెమిస్టర్కు ఈ యువతి గైర్హాజరైంది. దీంతో పంచకుల అనే ప్రాంతంలో ఉంటున్న తల్లి.. పలుమార్లు ఫోన్ చేసి పిలిచినా యువతి మాత్రం ఇంటికి వెళ్లలేదు. సోమవారం రెండో సెషన్ ప్రారంభమైనప్పటి నుంచి గదిలో దిగులుగా కనిపించింది. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. తర్వాత ఉన్నట్టుండి తన తల్లికి ఓ లేఖ రాసింది. ‘‘మమ్మీ అండ్ మోనూ, మీ అంచనాలను అందుకోలేకపోయాను క్షమించండి’’ అని రాసి కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కుమార్తె ఫోన్ ఆఫ్లో ఉండడంతో... అనుమానం వచ్చిన తల్లి అక్కడికి చేరుకుని తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో ఇరుగుపొరుగు వారి సాయంతో బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. యువతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె చెల్లించాల్సిన అప్పు వివరాలు కూడా రాసి ఉన్నారు. తాను ఓ పాల వ్యాపారికి రూ.1000లు ఇవ్వాలని, ఆ డబ్బులను ఆయనకు తిరిగి ఇవ్వాలని, అలాగే మిగతా వారి అప్పు కూడా తీర్చాలని రాసి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి