ఇవేం మరమ్మతులు..?
ABN , First Publish Date - 2021-02-24T04:48:43+05:30 IST
దాదాపు రెండున్నారేళ్ల తర్వాత ఎట్టకేలకు వైరా-మధిర,జగ్గయ్యపేట ఆర్అండ్బీ రోడ్డులో మరమ్మతులు మొదలయ్యాయి.
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
వైరా, ఫిబ్రవరి 23: దాదాపు రెండున్నారేళ్ల తర్వాత ఎట్టకేలకు వైరా-మధిర,జగ్గయ్యపేట ఆర్అండ్బీ రోడ్డులో మరమ్మతులు మొదలయ్యాయి. అయితే ఈ మరమ్మతులు జరుగుతున్న తీరు ప్రయాణీకులకు నరకయాతనగా మారింది. ఫ్లడ్ రిలీ్ఫఫండ్ కింద రూ.3కోట్ల నిధులతో ఈ మరమ్మతులు చేపట్టారు. తవ్విన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే ఏకధాటిగా కిలోమీటర్ దూరం రోడ్డు మొత్తాన్ని తవ్వేశారు. అంతేకాకుండా రోడ్డు మెతకతో గుంతలు ఏర్పడిన చోట తవ్వి పక్కన పోసిన నాసిరకం మట్టినే మళ్లీ గుంతల్లో సరిచేస్తున్నారు. మెతక, నాసిరకం అని భావించి తవ్వి పక్కనపోసిన మట్టినే మళ్లీ గుంతల్లో నింపుతుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కొంతదూరం రోడ్డు తవ్వి దాన్ని వెట్మిక్స్తో నింపిన తర్వాత మరికొంతదూరం రోడ్డును తవ్వి మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ జింకలగూడెం నుంచి రెబ్బవరం వరకు ఏకధాటిగా రోడ్డు మొత్తాన్ని తవ్వేశారు. ఆ రోడ్డుపైనుంచే నిత్యం వేలాది భారీ వాహనాలు మొదలుకొని కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు ప్రయాణించాల్సి వస్తుంది. తవ్విన రోడ్డుకు నీళ్లు చల్లకపోవడం వల్ల కిలోమీటర్ దూరం వాహనాలు వెళ్లిన సమయంలో దుమ్ము లేస్తుంది. ఆసమయంలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, సైకిళ్లపై వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్అండ్బీ అధికారులు ఈ మరమ్మతుల విషయంలో కనీస నిబంధనలు పాటించేవిధంగా కాంట్రాక్టర్పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారుని పలువురు విమర్శిస్తున్నారు. ఒక పద్దతి ప్రకారం నాణ్యతతో ఈమరమ్మతులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.