వాట్సాప్‌లో కొత్త స్కామ్.. ‘ఫ్రెండ్ ఇన్ నీడ్’

ABN , First Publish Date - 2021-11-13T22:35:24+05:30 IST

వాట్సాప్.. ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసెజింగ్ యాప్. అత్యంత సులభంగా సందేశాలు పంపుకునే వేదికగా పేరున్న ఈ వాట్సాప్‌ను ఉపయోగించి అంతే సులభంగా తమ పనులు పూర్తి చేయొచ్చు అని స్కామర్లు భావిస్తున్నట్లు..

వాట్సాప్‌లో కొత్త స్కామ్.. ‘ఫ్రెండ్ ఇన్ నీడ్’

న్యూఢిల్లీ: సైబర్ స్కామ్‌ల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటు టెక్నాలజీ పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే అనేక ఇబ్బందులు తప్పవు అని సైబర్ నిపుణులు తరుచూ చెబుతుంటారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ స్కామ్‌లు కూడా అప్‌డేట్ అవుతూ ఉంటాయి. తాజాగా వాట్సాప్ వేదికగా జరుగుతున్న ‘ఫ్రెండ్ ఇన్ నీడ్’ అనే స్కామ్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మనకు తెలిసిన వాళ్ల నంబర్ల నుంచి సందేశాలు పంపుతూ ఎక్కడో ఇరుక్కుపోయామని, లేదా తామే కష్టాల్లో ఉన్నామని నమ్మబలికి డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బు మాత్రమే కాకుండా కొన్ని సున్నితమైన వివరాలను కూడా సేకరిస్తున్నారు.


వాట్సాప్.. ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసెజింగ్ యాప్. అత్యంత సులభంగా సందేశాలు పంపుకునే వేదికగా పేరున్న ఈ వాట్సాప్‌ను ఉపయోగించి అంతే సులభంగా తమ పనులు పూర్తి చేయొచ్చు అని స్కామర్లు భావిస్తున్నట్లు సైబర్ టెక్ నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన టోని పర్కర్ అనే మహిళ.. తన కుమారుడి ఫోన్ నుంచి డబ్బులు కావాలంటూ సందేశం వచ్చింది. ఆమె రెండోసారి ఆలోచించకుండా 2,200 యూరోల డబ్బులు పంపింది. తీరా చూస్తే సందేశం పంపింది తన కుమారుడు కాదని తెలిసింది. ఈ విషయమై ఆమెను ప్రశ్నిస్తే పిల్లలు ఏదైనా కావాలని అడిగితే కాదనే తల్లిదండ్రులు ఎవరు? పైగా అత్యవసరం అని సందేశం వచ్చింది. ఆందోళనతో పంపించాను. పిల్లల విషయంలో నిజమా, అబద్దమా అని ఆలోచించలేమని చెప్పుకొచ్చారు.


యూకే నేషనల్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ ప్రకారం.. బ్రిటన్‌లో నివసిస్తున్న 59 శాతం మందికి ఈ స్కామ్ సందేశాలు అందాయి. తెలిసిన వారి నుంచి డబ్బులు కావాలనే సందేశాలతో పాటు, ఇతర వ్యక్తిగత వివరాలు కూడా స్కామర్లు అడుగుతారు. ఎవరు ఏం అడిగిన ఒకసారి ఫోన్ చేసి విషయం కనుక్కుని, నిజమని తెలిశాక ఏదైనా చేయండంటూ యూకే నేషనల్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ పేర్కొంది.

Updated Date - 2021-11-13T22:35:24+05:30 IST