నాలుగేళ్ల బాలికను మహిళ ఎత్తుకెళ్లిందంటూ ఫిర్యాదు.. విచారణలో పోలీసులకు షాకింగ్ విషయం తెలిసి..
ABN , First Publish Date - 2022-03-16T19:52:53+05:30 IST
మంగళవారం సాయంత్రం 4:30 గంటలు.. ఇంట్లో నిద్రిస్తున్న తమ నాలుగేళ్ల పాపను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది..
మంగళవారం సాయంత్రం 4:30 గంటలు.. ఇంట్లో నిద్రిస్తున్న తమ నాలుగేళ్ల పాపను ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కోసం గాలించారు.. ఆ బాలికను ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించారు.. అయితే ఆ మహిళ ఆ బాలికకు కన్న తల్లి అని తెలిసి పోలీసులు షాకయ్యారు.. రాజస్థాన్లోని ఆళ్వార్కు సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఆళ్వార్కు సమీపంలోని గిరాజ్ దర్శన్ గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి 2013లో సోనా లెష్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితం భార్యాభర్తల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. పది నెలల నుంచి సోనా తన పుట్టింట్లోనే ఉంటోంది. పెద్ద కూతురు సోనా దగ్గర, చిన్న కూతురు నరేంద్ర దగ్గర ఉంటున్నారు. ఈ క్రమంలో చిన్న కూతురిని చూసేందుకు సోనా మంగళవారం సాయంత్రం అత్తింటికి వెళ్లింది.
ఆ సమయంలో ఆ బాలిక నిద్రపోతోంది. ఇంట్లో ఎవరూ లేరు. దాంతో ఎవరికీ చెప్పకుండా నిద్రపోతున్న కూతురిని సోనా తనతో పాటు తీసుకెళ్లిపోయింది. కొద్ది సేపటి తర్వాత కూతురు మిస్ అయినట్టు చూసుకున్న నరేంద్ర వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ను గమనించిన పోలీసులు ఆ చిన్నారిని తల్లే తీసుకెళ్లిందని చెప్పారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.