అందుకే! ఫోన్ విషయంలో జాగ్రత్తలు పాటించమని చెప్పేది.. లేదంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి..
ABN , First Publish Date - 2022-08-28T00:51:04+05:30 IST
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ (Smart phone) యుగంలో ఫోన్ లేని మనిషిని ఊహించడం కష్టం. ఫోన్ లేకుండా కొన్ని నిముషాలు కూడా గడపలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇదే స్మార్ట్ ఫోన్ల..
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ (Smart phone) యుగంలో ఫోన్ లేని మనిషిని ఊహించడం కష్టం. ఫోన్ లేకుండా కొన్ని నిముషాలు కూడా గడపలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఇదే స్మార్ట్ ఫోన్ల కారణంగా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సెల్ఫీలు, గేమ్లు ఆడే క్రమంలో ప్రమాదానికి గురైన వారు కొందరైతే.. చార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడే క్రమంలో ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మొబైల్ను రిపేర్ చేయించేందుకు మెకానిక్ వద్దకు వెళ్లాడు. షాపులో బాక్సు తెరచి చూడగానే ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం జబల్పూర్లోని ఓ మొబైల్ దుకాణంలో (Mobile shop) గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పాడైన మొబైల్ను తీసుకుని మొబైల్ షాప్కు వచ్చాడు. దాన్ని రిపేరు చేసేందుకు మెకానిక్ బాక్సు తెరచి చూడబోయాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో మొబైల్ పేలిపోయి, మంటలు చెలరేగాయి. ఊహించని ఈ ఘటనతో చుట్టూ ఉన్న వారంతా పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పేలిన ఫోన్ లావా కంపెనీకి చెందినది అయి ఉండొచ్చని షాపు నిర్వాహకుడు అషు జైన్ తెలిపాడు. ఫోన్కు ఓవర్ చార్జింగ్ పెట్టడం, ఒక కంపెనీ చార్జర్తో మరో కంపెనీకి చెందిన మొబైల్కు చార్జింగ్ పెట్టడం, చార్జింగ్ ఎక్కే సమయంలో ఫోన్లు మాట్లాటడం తదితర పనులు చేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఫోన్ పేలిపోయిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.