పంద్రాగస్టు రోజు గాంధీజీ ఎక్కడ?

ABN , First Publish Date - 2022-08-15T10:19:06+05:30 IST

వందల ఏళ్ల పరాయి పాలనకు స్వస్తి పలికి.. స్వతంత్ర భారత దేశం ఆవిర్భవిస్తున్న సందర్భమది.

పంద్రాగస్టు రోజు గాంధీజీ ఎక్కడ?

వందల ఏళ్ల పరాయి పాలనకు స్వస్తి పలికి.. స్వతంత్ర భారత దేశం ఆవిర్భవిస్తున్న సందర్భమది. స్వాతంత్య్ర వేడుకలకు జనం సన్నద్ధులై ఉన్నారు. కానీ జాతిలో స్వాతంత్య్ర పిపాస రగిలించి.. స్వతంత్ర దేశం ఏర్పడడానికి కారణమైన మహాత్మాగాంధీ 1947 ఆగస్టు 15న ఎక్కడున్నారు? మతకల్లోలాలు, విద్వేషాలతో రగిలిపోతున్న కలకత్తా (ప్రస్తుతం కోల్‌కతా)లో శాంతి స్థాపన యత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. ఆగస్టు 6న లాహోర్‌లో కలకత్తా మెయిల్‌ రైలులో ఎక్కిన ఆయన.. 9న కలకత్తా చేరుకున్నారు. అక్కడి నుంచి సంక్షుభిత నొవాఖలీ (ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉంది) వెళ్లాలని భావించారు. అక్కడ ముస్లింలు.. హిందువులను ఊచకోత కోశారు. అయితే కలకత్తాలోనే గాంధీజీ ఉండాలని..


నగరంలోని ముస్లింలకు రక్షణ కల్పించాలని  ముస్లింల బృందం ఆయన్ను కోరింది. అయితే నొవాఖలీలో మైనారిటీల ప్రాణాలకు గ్యారెంటీ ఇస్తామంటేనే ఉంటానని.. తనకిచ్చిన హామీకి విరుద్ధంగా అక్కడ హింస చెలరేగితే ఆమరణ దీక్షకు కూర్చుంటానని ఆయన హెచ్చరించారు. ఆగస్టు 11న బెంగాల్‌ మాజీ ప్రధాని హెచ్‌ఎస్‌ సుహ్రవర్దితో కలిసి కలకత్తాలో పేద ముస్లింలు ఉండే బెలియాఘాటాలోని హైదరీ మాన్షన్‌ (ప్రస్తుతం గాంధీభవన్‌)లో బస చేశారు. అయితే హిందువులను ఊచకోత కోసిన ముస్లింల రక్షణకు వచ్చారంటూ బాపూజీపై హిందూ యువత ఆందోళనలు కొనసాగించారు. ‘మీరు మళ్లీ హింసకు దిగితే చూసేందుకు నేను బతికి ఉండను. నొవాఖలీ ముస్లింలకు కూడా ఇదే చెప్పాను’ అని గాంధీజీ వారితో అన్నారు. ఆగస్టు 14 సాయంత్రం నవభారత సంక్షేమానికి 24 గంటల దీక్ష చేపట్టేందుకు గాంధీజీ అందరినీ ఆహ్వానించారు. కానీ ప్రార్థనల తర్వాత హైదరీ మాన్షన్‌పై మళ్లీ రాళ్ల దాడి జరిగింది.  బాపూజీ ఆందోళనకారులతో మాట్లాడారు. సుహ్రవర్దిని తన వద్దకు పిలిచి ఆయన భుజంపై చేయివేశారు. 1946లో జరిగిన కలకత్తా హత్యాకాండకు తనదే బాధ్యతంటూ సుహ్రవర్ది క్షమాపణ చెప్పడంతో యువకులు శాంతించారు.

Updated Date - 2022-08-15T10:19:06+05:30 IST