ఏదీ జలకళ?
ABN , First Publish Date - 2020-11-09T04:21:47+05:30 IST
‘జలకళ’ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. ఇప్పటికీ జిల్లాలో ఒక్కచోట కూడా బోరు పడలేదు. దీంతో రైతన్నలు నిరాశ పడుతున్నారు.
జిల్లాలో ఒక్క బోరూ పడని వైనం
29 వేల మంది రైతుల్లో నిరాశ
విజయనగరం (ఆంధ్రజ్యోతి) నవంబరు 8 : ‘జలకళ’ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. ఇప్పటికీ జిల్లాలో ఒక్కచోట కూడా బోరు పడలేదు. దీంతో రైతన్నలు నిరాశ పడుతున్నారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది రిగ్గులను మంజూరు చేశారు. పథకం కోసం సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు నిబంధనల ప్రకారం జిల్లావ్యాప్తంగా రెండున్నర ఎకరాల భూమి ఉన్న 29 వేల మంది రైతులు ‘జలకళ’ కింద బోర్లు కావాలని అర్జీలు పెట్టుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. రిగ్గుల యాజమాన్యానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన అగ్రిమెంటు ఇవ్వకపో వడంతో ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జలకళకు సంబంధించి రిగ్గుల విషయమై త్వరలోనే అగ్రిమెంట్లు జరుగుతాయని, ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి కానుందని డ్వామా పీడీ నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 29 వేల మందికి కూడా బోర్లు మంజూరు చేస్తామన్నారు. ఇంకెవరైనా అర్హులుంటే దరఖాస్తు చేసుకోవచ్చని, అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.