ఆరు నెలలు దాటిన పిల్లలకు తీపి పదార్థాలు పెడుతున్నారా? అయితే..

ABN , First Publish Date - 2020-02-16T18:09:48+05:30 IST

మా పాపకు తొమ్మిది నెలలు. రాగిజావలో బెల్లం వేసి పెట్టొచ్చా?

ఆరు నెలలు దాటిన పిల్లలకు తీపి పదార్థాలు పెడుతున్నారా? అయితే..

ఆంధ్రజ్యతి(16-02-2020)

ప్రశ్న: మా పాపకు తొమ్మిది నెలలు. రాగిజావలో బెల్లం వేసి పెట్టొచ్చా?

- అలేఖ్య,విజయవాడ

జవాబు: ఆరునెలలు దాటిన పిల్లలకు తల్లి పాలతో పాటు ఘనాహారం ఇవ్వాలి. అందులో భాగంగా జావను కూడా పెట్టవచ్చు. కానీ బెల్లం లేదా చక్కెర వేయడం వల్ల పిల్లలకు తీపి పదార్థాలు మాత్రమే ఇష్టం అవుతాయి. తర్వాత తర్వాత మిగతా రుచులను ఇష్టపడరు. కనీసం ఐదో సంవత్సరం వచ్చేవరకు రోజువారీ ఆహారంలో తీపి పదార్థాలను ఇవ్వకపోవడం మంచిది. బెల్లానికి బదులుగా అరటి పండు లేదా ఉడికించిన ఆపిల్‌ గుజ్జు పెట్టవచ్చు. ఇవేమీ లేకుండా, జావలో కొద్దిగా పెరుగు లేదా మజ్జిగ కలిపి తినిపించవచ్చు.  దీంతో పాటు రెండు పూటలా మెత్తగా కలిపిన అన్నం, పప్పు, చారు వంటివి ఇవ్వవచ్చు. బియ్యం, కంది లేదా పెసర పప్పులు, కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తాపప్పు మొదలైనవి కలిపి రవ్వలా చేసి, ఆ మిశ్రమాన్ని నీళ్లలో ఉడికించి... దానిలో రసం, నెయ్యి వేసి పెట్టవచ్చు. ఉడికించిన ఓట్స్‌లో కూడా ఇలా రసం కలిపి పెట్టవచ్చు. పాపకు ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తుంటాయి కాబట్టి ఆహారాన్ని చేత్తో లేదా స్పూనుతో నలిపి ఇవ్వండి. వండిన కూరగాయలూ మెదిపి పెట్టవచ్చు. ఆకుకూరలను పప్పులో కలిపి వండి వారానికి మూడు రోజులు పెట్టవచ్చు. క్యారెట్‌, బీట్‌రూట్‌ వంటి కూరగాయల సూప్‌ పెట్టవచ్చు. ఉడికించిన గుడ్డులోని పచ్చ సొనను కొద్దిపాటి అన్నంలో కలిపి తినిపించినా మంచిదే. 


డా.లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలనుsunday.aj@gmail.comji కు పంపవచ్చు)

Updated Date - 2020-02-16T18:09:48+05:30 IST