Eknath Shinde: ఆటో డ్రైవర్ సీట్ టూ సీఎం సీట్.. షిండే జీవితంలో విషాదకరమైన రోజు అదే..

ABN , First Publish Date - 2022-07-01T00:37:00+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. బీజేపీ సంపూర్ణ మద్దతుతో శివసేన మాజీ మంత్రి, రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా..

Eknath Shinde: ఆటో డ్రైవర్ సీట్ టూ సీఎం సీట్.. షిండే జీవితంలో విషాదకరమైన రోజు అదే..

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. బీజేపీ సంపూర్ణ మద్దతుతో శివసేన మాజీ మంత్రి, రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉద్ధవ్‌ను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఈ ఏక్‌నాథ్ షిండే నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. ఏక్‌నాథ్ షిండే రాజకీయ రంగ ప్రవేశానికి ముందు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూశారు. 1964, ఫిబ్రవరి 9న సతారాలో ఏక్‌నాథ్ జన్మించారు. థానేలోని మంగళ హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజ్‌లో 11వ తరగతి చదివారు. ఆ తర్వాత చదువుకునేందుకు ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కుటుంబానికి అండగా నిలిచేందుకు చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టారు.



ఏదో ఒక పని చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఆసరా అవ్వాలని షిండే నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే.. కుటుంబంతో సహా థానేకు వెళ్లి అక్కడే ఆటో డ్రైవర్‌గా పని వెతుక్కున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాక షిండే వివాహం చేసుకున్నారు. ఒక బాబు, పాప పుట్టారు. అయితే.. పిల్లలిద్దరితో సంతోషంగా జీవితం గడుపుతున్న షిండేను కొన్నేళ్లకు ఊహించని ఘటన విషాదంలోకి నెట్టేసింది. సతారాలో ఏక్‌నాథ్ షిండే పిల్లలిద్దరూ ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోవడంతో చనిపోయారు. ఈ ఘటన షిండేను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్నేళ్ల పాటు ఆ షాక్ నుంచి ఆయన కోలుకోలేకపోయారు.



ఆ తర్వాత 1980లో శివసేన మాజీ అధ్యక్షుడు ఆనంద్ డిగే ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఏక్‌నాథ్ షిండే ఎంట్రీ ఇచ్చారు. శివసేనలో చేరి కార్పొరేటర్‌గా గెలిచారు. మాస్ లీడర్‌గా మంచి ఆదరణ సంపాదించుకున్న డిగే అడుగుజాడల్లో నడిచి ఏక్‌నాథ్ షిండే బలమైన నేతగా ఎదిగారు. 2004, 2009, 2014, 2019లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏక్‌నాథ్ షిండే మరో కుమారుడు శ్రీకాంత్ షిండే కల్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి శివసేన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏక్‌నాథ్ షిండే సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు. ఇలా.. అనూహ్య పరిణామాల నడుమ ఆటో డ్రైవర్ సీటులో కూర్చుని జీవితాన్ని మొదలుపెట్టిన ఏక్‌నాథ్ షిండే సీఎం సీటులో కూర్చోబోతున్నారు.

Updated Date - 2022-07-01T00:37:00+05:30 IST