‘మహా’ సంక్షోభానికి కారణమైన Eknath Shinde ఎవరు?
ABN , First Publish Date - 2022-06-21T21:35:06+05:30 IST
మహారాష్ట్రలో ఒక్కసారిగా తలెత్తిన రాజకీయ సంక్షోభానికి మూల బిందువు అయిన ఏక్నాథ్ షిండే (Ekanath Shinde) పేరు
ముంబై: మహారాష్ట్రలో ఒక్కసారిగా తలెత్తిన రాజకీయ సంక్షోభానికి మూల బిందువు అయిన ఏక్నాథ్ షిండే (Ekanath Shinde) పేరు ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఎవరన్న ఆరా మొదలైంది. శివసేన అగ్రనేతల్లో ఒకరైన షిండే ప్రస్తుత మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని గుజరాత్లోని సూరత్లో ఓ హోటల్లో మకాం వేసిన షిండే.. ముంబైకి సమీపంలోని థానేకు చెందినవారు. పార్టీని ఇతర ప్రాంతాల్లోనూ బలోపేతం చేయడంలో ఆయన ఎనలేని కృషి చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీకి షిండే వరుసగా నాలుగుసార్లు.. 2004, 2009, 2014, 2019లలో ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత శివసేన లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీ నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏక్నాథ్ షిండే కీలక పాత్ర పోషించేవారు. ఆయన తనయుడు శ్రీకాంత్ షిండే ఎంపీ కాగా, సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్. ఉద్దేశపూర్వకంగా తనన పక్కన పెట్టడంతో షిండే గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు, పలువురు సేన ఎమ్మెల్యేల నుంచి కూడా ఆయన గట్టి మద్దతు ఉంది.