గుజరాత్ తర్వాతి సీఎం ఎవరు? బీజేపీ లిస్ట్లో ఉన్నది వీరేనట!
ABN , First Publish Date - 2021-09-12T01:44:37+05:30 IST
వీరితో పాటు పాటిదార్ సామాజిక వర్గం నుంచి మరో కేంద్ర మంత్రి మాన్షుక్ మాందవీయ కూడా రేసులో ఉన్నారట. వీరితో పాటు మరో కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలాకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయట..
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ రాజీనామా చేసిన అనంతరం తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే విషయమై ఆసక్తి నెలకొంది. కాగా, భారతీయ జనతా పార్టీ లిస్ట్లో ఉన్నది వీరేనంటూ కొన్న పేర్లు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేదంటే అప్పటి వరకు రాష్ట్రపతి పాలన కొనసాగిస్తారా అనే ప్రశ్నలు వచ్చాయి. అయితే రాజీనామా అనంతరం రూపానీ మాట్లాడుతూ ‘‘మోదీ దిశానిర్దేశంలో నూతన నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది’’ అని అన్నారు. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని రూపానీ చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కేంద్ర మంత్రి ప్రఫుల్ కోడా పటేల్, గుజరాత్కు కాబోయే ముఖ్యమంత్రి వరుసలో ఉన్నారట. ఈయనతో పాటు గుజరాత్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆర్సీ ఫాల్దూ సైతం సీఎం రేసులో ఉన్నారట. గుజరాత్లో పటేల్ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో పటేల్కు రిజర్వేషన్లు కల్పించాలని జరిగిన ఉద్యమంతో అది రాజకీయంగా చాలా బలపడింది. వీరిద్దరూ పటేల్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్ల ముఖ్యమంత్రిగా వీరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
వీరితో పాటు పాటిదార్ సామాజిక వర్గం నుంచి మరో కేంద్ర మంత్రి మాన్షుక్ మాందవీయ కూడా రేసులో ఉన్నారట. వీరితో పాటు మరో కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలాకు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయట. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై వీరిమధ్య చర్చ కూడా జరుగుతోందట. అయితే ఎవరు రేసులో ఉంటారు, ఎవరూ తప్పుకుంటారనే విషయంతో చర్చ ఎటూ తేలడం లేదని పార్టీ వర్గాల నుంచి సమాచారం.