ఎవరా ఆగంతుకుడు?
ABN , First Publish Date - 2021-03-08T06:14:27+05:30 IST
పది రోజుల నుంచి దుద్దుకూరులో చోటు చేసుకుంటున్న సంఘటనలతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
దేవరపల్లి, మార్చి 7: పది రోజుల నుంచి దుద్దుకూరులో చోటు చేసుకుంటున్న సంఘటనలతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. దుద్దుకూరులో కొన్ని రోజుల క్రితం సైకోగా అనుమానిస్తున్న వ్యక్తి ఒక ఇంటికి వెళ్లి మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొనే ప్రయత్నం చేయగా ఆమె బిగ్గరగా అరవడంతో పారిపోయి ఆదివారం అదే ఇంటికి వెళ్లి మహిళ మెడపై చాకుతో గాయపరిచాడు. మరో మహిళ చెయ్యి పట్టుకుని గాజులు లాగటంతో గాజులు పగిలి చేతికి తీవ్ర గాయమైంది. ఒక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపుకు నిప్పుపెట్టి గదిలో ఉన్న బంగారం, నగదు దోచుకుని పోయినట్లు బాధితులు తెలిపారు. సంఘటనకు కారణమైన వ్యక్తి ఎప్పటికప్పుడు అదృశ్యం కావడంతో అతడు దొంగతనానికి వచ్చాడా లేక మానసిక పరిస్థితి సరిగా లేనోడా అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రామ యువకులు రాత్రుళ్లు గస్తీ కాస్తున్నారు. ఈ సంఘటనలపై దేవరపల్లి ఎస్సై స్వామిని వివరణ కోరగా గ్రామస్థులు భయపడాల్సిన అవసరం లేదని ఈ సంఘటనలకు పాల్పడిన వ్యక్తి ఆకతాయి అయి ఉంటాడని, రాత్రుళ్లు దుద్దుకూరులో పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు.