నన్నెందుకు అరెస్టు చేయలేదు? : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-02-18T18:52:24+05:30 IST

తాను ఖలిస్థానీ వేర్పాటువాదినని వచ్చిన ఆరోపణలను

నన్నెందుకు అరెస్టు చేయలేదు? : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : తాను ఖలిస్థానీ వేర్పాటువాదినని వచ్చిన ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. తాను ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలను నిర్మిస్తున్నందుకు మధురమైన ఉగ్రవాదిని అయి ఉండవచ్చునన్నారు. తాను ఉగ్రవాదినై ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.


ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడుతూ కేజ్రీవాల్ ఖలిస్థాన్ అనుకూలవాది అని ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 


కేజ్రీవాల్ శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ, ‘‘నేను ప్రజల కోసం ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మించే మధురమైన ఉగ్రవాదిని అయి ఉండవచ్చు’’ అని చెప్పారు. ‘‘నేను వేర్పాటువాదిని అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలిసి ఉంటే, ఆ విషయాన్ని ఆయన ఎందుకు రుజువు చేయలేదు? ఈ ఆరోపణలపై ఎందుకు దర్యాప్తు చేయించలేదు?’’ అని ప్రశ్నించారు. 


దేశాన్ని రెండు ముక్కలుగా విభజించేందుకు తాను పదేళ్ళ నుంచి ప్రయత్నిస్తున్నానని, ఓ భాగానికి ప్రధాన మంత్రినవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నానని వాళ్లు (బీజేపీ, కాంగ్రెస్ నేతలు) అంటున్నారన్నారు. ఇదంతా కామెడీగా ఉందన్నారు. ఈ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. తాను చాలా పెద్ద ఉగ్రవాదినని ఈ మాటల అర్థమని, అలాంటపుడు వారి భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా పదేళ్ళపాటు అధికారంలో ఉందని, అప్పుడు వారు నిద్రపోతున్నారా? అని అడిగారు. మోదీ నన్ను ఎందుకు అరెస్టు చేయించలేదు? అని ప్రశ్నించారు.  


ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి అకాలీదళ్, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలన్నీ కలిసికట్టుగా వస్తున్నాయని, ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ, సుఖ్‌బీర్ బాదల్, చరణ్ జిత్ సింగ్ చన్నీ వంటి నాయకులంతా కలిసి వస్తున్నారని ఆరోపించారు. పంజాబ్ శాసన సభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ చాలా నిజాయితీపరుడని చెప్పారు. 


ఈ నాయకులంతా ఒకే విధంగా మాట్లాడుతున్నారన్నారు. దీనినిబట్టి వీరంతా రాత్రి సమయంలో వీడియో కాల్‌ లేదా కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుకుంటున్నట్లు ఉందన్నారు. ‘‘మేం చేసిన తప్పేంటి’’ అని ప్రశ్నించారు. 


వివాదానికి మూలం...

ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ ఇటీవల ఓ వీడియోలో అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణ చేశారు. కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని కోరుకుంటున్నారని, అది కుదరకపోతే ఖలిస్థాన్ ప్రధాన మంత్రి అవాలనుకుంటున్నారని ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, వీరంతా పంజాబ్‌ను విభజించాలని కలలుగంటున్నారని మండిపడ్డారు. అధికారంలో కొనసాగటం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడానికి సైతం వీరు సిద్ధమేనన్నారు. వారి ఎజెండాకు, పాకిస్థాన్ ఎజెండాకు తేడా లేదన్నారు. 


పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ స్పందిస్తూ, కేజ్రీవాల్‌పై కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.



Updated Date - 2022-02-18T18:52:24+05:30 IST