Gandhi jayanti: ఫేక్ గాంధీలంటూ సీఎం బొమ్మై ఎద్దేవా...డీకే కౌంటర్
ABN , First Publish Date - 2022-10-02T21:14:49+05:30 IST
గాంధీ జయంతి రోజున గాంధీల కుటుంబంపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై విమర్శలు చేయడంతో..
బెంగళూరు: గాంధీ జయంతి రోజున గాంధీల కుటుంబంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) విమర్శలు చేయడంతో కాంగ్రెస్ ఘాటుగా తిప్పికొట్టింది. భారత్ జోడో యాత్ర 25వ రోజులో భాగంగా రాహుల్ గాంధీ కర్ణాటలోని బడానేవాలాలో గాంధీజీ 153వ జయంత్రి ఉత్సవంలో పాల్గొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి బొమ్మై మాట్లాడుతూ, ఈరోజు గాంధీ జయంతి అని, ఆయనో (రాహుల్) నకిలీ గాంధీ (Fake gandhi) అని అన్నారు. నకిలీ గాంధీ గురించి, ఆయన కుటుంబం గురించి తానెందుకు మాట్లాడాలని ప్రశ్నించారు. రాహుల్, సోనియాగాంధీ, డీకే శివకుమార్ సహా ఆ పార్టీ నేతలంతా బెయిల్పై బయట ఉన్నారని, ఆ పార్టీకి కర్ణాటక ఏటీఎం అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అది కూడా చేజారిపోయిందని ఎద్దేవా చేశారు.
డీకే ఫైర్...
ముఖ్యమంత్రి బొమ్మై చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మండిపడ్డారు. బీజేపికి చెందిన డజన్ల మంది నేతలు బెయిలుపై ఉన్నారని గుర్తుచేశారు. తాను, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కూడా బెయిలుపై ఉన్నారని, బీజేపీలోనూ చాలా మంది బెయిలుపై బయట ఉన్నారని చెప్పారు. యడ్యూరప్పపై కేసులు లేవా అని ప్రశ్నించారు. తనపై బొమ్మై కేసులు బనాయించారని, తనను పరప్పన జైలుకు పంపవచ్చనీ, అక్కడే రెస్ట్ తీసుకుంటానని అన్నారు.