మరణంలోనూ వీడని బంధం

ABN , First Publish Date - 2021-07-28T07:11:35+05:30 IST

మరణంలోనూ వారు భార్యభర్తల బంధం వీడలేదు. కలిసి ఏడడుగులు నడిచిన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒకేసారి కబళించంది.

మరణంలోనూ వీడని బంధం
గోగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీనారాయణమ్మ(ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం

మార్కాపురం, జూలై 27 : మరణంలోనూ వారు భార్యభర్తల బంధం వీడలేదు. కలిసి ఏడడుగులు నడిచిన వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒకేసారి కబళించంది. ఈ విషాద సంఘటన మంగళవారం మండలంలోని కోమటికుంట వద్ద గుంటూరు-అనంతపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు మండలంలోని నికరంపల్లికి చెందిన రైతు గోగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి(62) భార్య లక్ష్మీనారాయణమ్మ(58)తో కలిసి నిత్యావసరాల సరుకుల కోసం  మోపెడ్‌పై మార్కాపురం వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్కాపురం రోడ్డు నుంచి  కోమటికుంట సమీపంలో జాతీయ రహదారి ఎక్కేందుకు మూలమలుపు తిరుగుతున్న సమయంలో గుంటూరు నుంచి కర్నూలు వైపునకు వెళుతున్న సిమెంట్‌ మిక్సర్‌ లారీ మోపెడ్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో లక్ష్మీ నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరెడ్డిని మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంకటేశ్వరరెడ్డికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ జి.కోటయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-07-28T07:11:35+05:30 IST