భర్త వేధింపులు తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషం తాగించి.. ఆ తల్లి కూడా..

ABN , First Publish Date - 2020-08-06T17:22:17+05:30 IST

హన్మకొండకు చెందిన కడారి అనూష (28) అనే గృహిణి హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.

భర్త వేధింపులు తట్టుకోలేక.. ఇద్దరు పిల్లలకు విషం తాగించి.. ఆ తల్లి కూడా..

వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య


వరంగల్‌ అర్బన్‌ (ఆంధ్రజ్యోతి): హన్మకొండకు చెందిన కడారి అనూష (28) అనే గృహిణి హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. హన్మకొండ సీఐ దయాకర్‌ వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలం జూపాక గ్రామానికి  చెందిన అనూషను అదే గ్రామానికి చెందిన కడారి అనిల్‌కు ఇచ్చి వివాహం చేశారు. భార్యభర్తలు బతుకుదెరువు కోసం హన్మకొండకు వచ్చి హనుమాన్‌నగర్‌లో స్థిరపడ్డారు. అనిల్‌ గుండ్లసింగారంలోని బెవరేజ్డ్‌ గోదాములో హమాలీగా పని చేస్తున్నాడు. 


ఈ క్రమంలో అనిల్‌ మద్యానికి బానిసై అదనపు కట్నం కోసం అనూషను వేధించేవాడు. అతడి వేధింపులు తాళలేక జూలై 29వ తేదీన ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందును ఇద్దరు పిల్లలకు తాగించి తాను తాగింది. అందరూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో చుట్టుపక్కల వారు చూసి చికిత్స కోసం అదే రోజు హైదరాబాద్‌కు తరలించారు. ఇద్దరు పిల్లలు కోలుకోగా అనూష మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనిల్‌, అతడి తండ్రి కుమారస్వామిలపై వరకట్న వేధింపుల కేసును నమోదు చేసి విచారిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నట్టు సీఐ తెలిపారు. 

Updated Date - 2020-08-06T17:22:17+05:30 IST