ఫలించిన భార్య పోరాటం.. ఎట్టకేలకు భర్త మృతదేహాన్ని..
ABN , First Publish Date - 2022-08-29T14:20:51+05:30 IST
పరాయి దేశంలో మరణించిన భర్తకు సంప్రదాయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు భార్య చేసిన పోరాటం ఫలించింది. సౌదీ అరేబియాలో రెండు నెలల కిందట పాతిపెట్టిన మృతదేహాన్ని ఎట్టకేలకు తవ్వితీసి విమానంలో చెన్నైకి పంపించారు. తమిళనా
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పరాయి దేశంలో మరణించిన భర్తకు సంప్రదాయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు భార్య చేసిన పోరాటం ఫలించింది. సౌదీ అరేబియాలో రెండు నెలల కిందట పాతిపెట్టిన మృతదేహాన్ని ఎట్టకేలకు తవ్వితీసి విమానంలో చెన్నైకి పంపించారు. తమిళనాడులోని మధురైకి చెందిన అండిత్తమీ పళనిసామి(42) సౌదీ అరేబియాలోని మజ్మా ప్రాంతంలో పని చేస్తూ గుండెపోటుతో మే 19న మరణించారు. మృతదేహాన్ని తమిళనాడుకు పంపించాలని ఆయన భార్య వేదాచీ కోరగా భారతీయ ఎంబసీ జూన్ 14న నిరభ్యంతర పత్రాన్ని జారీ చేసింది. అయితే, మృతదేహాన్ని పళనిసామి యాజమాని జూన్ 16న సౌదీలోనే ఖననం చేసేశారు. దీనిపై అభ్యంతరం తెలిపిన వేదాచీ.. తన భర్త మృతదేహాన్ని లేదా అస్ధికలనైనా తనకు పంపించాలంటూ రియాధ్లోని భారతీయ ఎంబసీకి విన్నవించారు. సౌదీ అధికారులు కూడా దీనిపై సానుకూలత వ్యక్తం చేశారు. రెండు నెలలు వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన భారతీయ ఎంబసీ అధికారులు చివరికి పళనిసామి మృతదేహాన్ని తవ్వి తీసి రియాధ్ నగరానికి, అక్కడి నుంచి శ్రీలంక ఎయిర్ లైన్స్ ద్వారా శనివారం చెన్నైకి పంపించారు.