భర్తతో గొడవపడి ఉరేసుకుని భార్య ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-04-29T17:14:05+05:30 IST
భర్తతో తరచూ గొడవపడుతున్న ఓ మహిళ చివరకు చెట్టుకు
హైదరాబాద్/నార్సింగ్ : భర్తతో తరచూ గొడవపడుతున్న ఓ మహిళ చివరకు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నార్సింగ్ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా బూత్పురా మండలం తాటికొండ గ్రామానికి చెందిన జేగి పద్మ(38) భర్త వెంకటయ్య ఇద్దరు పిల్లలతో కలిసి నెక్నాంపురా వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటూ కూలి పని చేసుకుంటున్నారు. అయితే తరచూ భర్తతో పద్మ గొడవపడేది. మంగళవారం రాత్రి కూడా భర్తతో గొడవపడింది. పద్మ సోదరుడు మల్లేశ్ అక్కడికి చేరుకొని వారిని సముదాయించాడు. బుధవారం ఉదయం పద్మ భర్తతో గొడవ పడుతుండగా మల్లేశ్ తన సోదరిని మరోసారి సముదాయించి బావ వెంకటయ్యను తీసుకొని పనికి వెళ్లిపోయాడు. అయితే 10:30 ప్రాంతంలో పద్మ ఇంటికి ఎదురుగా ఉన్న చెట్టుకు చీరతో ఉరివేసుకుంది. గమనించిన ఆమె కొడుకు తండ్రి, మామకు సమాచారం అందించాడు. వారు వచ్చి నార్సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.