రాత్రి పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన యువకుడు మాయం.. కథనం అల్లిన అనుమానితుడు.. అసలు నిజం తెలిసి పోలీసులు షాక్!
ABN , First Publish Date - 2021-11-30T13:15:12+05:30 IST
మధ్యప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. సీహోర్ పరిధిలోని నిపానియా సిక్కా గ్రామంలోని ఒక పొలంలో విమలేష్ వర్మ(32) అనే యువకుని మృతదేహం లభ్యమయ్యింది. ఈ యువకుడు రాత్రి వేళ తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఉదయం అతని కుటుంబం సభ్యులు పొలానికి వచ్చి చూసే సరికి విగతజీవిగా కనిపించాడు. విమలేష్ను మారణాయుధాలతో అంతమొందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఉదంతంలో హస్తముందని భావిస్తున్న పంకజ్ వర్మ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో అతను నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులకు తెలియజేస్తూ..మంత్రతంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తాను విమలేష్ను హత్య చేసినట్లు తెలిపాడు. అయితే ఈ కేసు ఉన్నట్టుండి మరో మలుపు తిరిగింది. మృతుని తండ్రి ఘిసిలాల్ వర్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుని హత్యకు అతని భార్యనే కారణమని ఆరోపించారు. ఈ హత్యలో గ్రామానికి చెందిన లీలాధర్, రమేష్ల హస్తం కూడా ఉందని ఆరోపించారు. విమలేష్ భార్య, నిందితుడు పంకజ్ల మధ్య అక్రమ సంబంధం ఉందని, ఈ విషయం తన కుమారునికి తెలిసిన నేపధ్యంలో వారిద్దరూ కలసి తన కుమారుడిని హత్య చేశారని పేర్కొన్నారు. దీంతో పోలీసులు విమలేష్ భార్య రీనాను అరెస్టు చేసి ప్రశ్నించడంతో, ఆమె నేరాన్ని అంగీకరించింది. తనకు.. పంకజ్ వర్మకు మధ్య సంబంధం ఉన్నదని.. ఈ విషయం తన భర్తకు తెలిసిందన్నారు. ఈ కారణంగానే తాము విమలేష్ను హత్య చేశామని తెలిపింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.