భార్యను పొడిచి.. భర్త ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-03-12T00:36:09+05:30 IST
అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను కర్కశంగా కత్తితో పొడిచి చివరకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడో భర్త.
గణపవరం: అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భార్యను కర్కశంగా కత్తితో పొడిచి చివరకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడో భర్త. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరానికి చెందిన చిగురుకోట శ్రీను, పెరవలి మండలం కడింపాడుకు చెందిన కాటం వెంకటేశ్వరరావు కుమార్తె జ్యోతి(31)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. మూగ, చెవుడు వున్న శ్రీను సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. జ్యోతిపై భర్త అనుమానం పెంచుకోవడంతో తరచూ గొడవలు పడుతుండేవాడు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఘర్షణ తారస్థాయికి చేరి కూరగాయల కత్తితో జ్యోతి కంఠం వద్ద పొడవటంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. అదే కత్తితో శ్రీను తనకు తాను మెడకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శ్రీనును తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.