రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త ఆస్పత్రిపాలు
ABN , First Publish Date - 2021-05-11T04:53:05+05:30 IST
మండలంలోని పురుషోత్తపురం వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు.
ఉపాధి కరువై స్వగ్రామానికి వెళుతుండగా దుర్ఘటన
ఎలమంచిలి, మే 10: మండలంలోని పురుషోత్తపురం వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించి ఎలమంచిలి రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన దంపతులు కె.నాయుడు, గౌరీ (35) కొన్నాళ్లుగా రాజమండ్రిలో నివాసం ఉంటున్నారు. అక్కడ కూలీలతో చిన్నచిన్న పనులు చేయిస్తూ నాయుడు కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా కారణంగా కర్ఫ్యూ విధించడంతో ప్రస్తుతం పనులు కరువయ్యాయి. దీంతో భార్యతో కలిసి సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన సాలూరు బయలుదేరాడు. పురుషోత్తపురం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారి పక్కనున్న సిమెంటు దిమ్మను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గౌరీ అక్కడికక్కడే మృతిచెందగా, నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. గౌరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎలమంచిలి మార్చురీకి తరలించి, కేసు నమోదుచేసినట్టు ఎస్ఐ చెప్పారు.
కరోనాతో రైల్వే అధికారి మృతి
విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి): వాల్తేరు రైల్వే డివిజన్లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ పీఎన్ విజయకుమార్ కరోనాతో సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన కొద్దిరోజులుగా కరోనాకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని రైల్వే వర్గాలు తెలిపాయి.