HYD : భర్త హార్డ్‌వేర్.. డిగ్రీ పరీక్షలు రాయడానికి వెళ్లిన భార్య.. ఇరుగుపొరుగు వారికి అలా చెప్పాడని కత్తితో పొడిచేసి.. అనుమానం రాకుండా.. మరుసటి రోజే ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-11-09T15:02:58+05:30 IST

మురళీధర్‌రెడ్డి (42), మౌనిక దంపతులు తమ కుమారుడు శ్రేయాస్‌రెడ్డితో కలిసి ...

HYD : భర్త హార్డ్‌వేర్.. డిగ్రీ పరీక్షలు రాయడానికి వెళ్లిన భార్య.. ఇరుగుపొరుగు వారికి అలా చెప్పాడని కత్తితో పొడిచేసి.. అనుమానం రాకుండా.. మరుసటి రోజే ట్విస్ట్..!

  • భర్తను కడతేర్చిన భార్య
  • కత్తితో పొడిచి.. ఆత్మహత్యగా చిత్రీకరించేయత్నం
  • అంత్యక్రియలకూ హాజరుకాని వైనం
  • మరుసటి రోజు పోలీసులకు లొంగుబాటు

హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్‌ : భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య చివరకు అతన్ని హతమార్చిన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన భార్య చివరకు తానే హత్య చేశానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయింది. సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారాం కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.


నల్గొండ జిల్లా బుసిరెడ్డిగూడెంకు చెందిన మురళీధర్‌రెడ్డి (42), మౌనిక దంపతులు తమ కుమారుడు శ్రేయాస్‌రెడ్డితో కలిసి శ్రీసాయికృష్ణనగర్‌ కాలనీ సాయినిఖిల అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. మురళీధర్‌రెడ్డి హైటెక్‌సిటీలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా, మౌనిక ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. కొంతకాలంగా దంపతుల నడుమ గొడవలు జరుగుతున్నాయి. అయితే మౌనిక డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు రాసేందుకు గురజాల వెళ్లి ఈనెల 6న తిరిగి వచ్చింది.


దుష్ప్రచారం చేస్తున్నాడన్న బాధతో..

‘ఇరుగుపొరుగు వారికి, బంధువులకు నాన్న ఫోన్‌ చేసి నీ గురించి చెడుగా చెబుతున్నాడని’ కుమారుడు శ్రేయాస్‌రెడ్డి మౌనికకు వివరించాడు. దీంతో మౌనిక భర్తను నిలదీసింది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. మౌనికపై భర్త చేయిచేసుకున్నాడు. ఆ సమయంలో కుమారుడితో వంట గదిలో ఉన్న కూరగాయల కత్తి తెప్పించుకుని భర్త మెడపై బలంగా పొడిచింది. దీంతో తీవ్ర రక్తస్రావం కాగా, వెంటనే 108కు ఫోన్‌ చేసింది. అంబులెన్స్‌ వచ్చేలోగా అతను మృతి చెందాడు.


అయితే, భర్తే కత్తితో పొడుచుకున్నాడని ఇరుగు పొరుగు వారికి, పోలీసులకు చెప్పింది. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.  ఆస్పత్రి వద్ద ఉండకుండా మౌనిక వెళ్లిపోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మురళీధర్‌రెడ్డి తల్లిదండ్రులకు అప్పగించారు. మౌనిక అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లోగా తానే భర్తను కత్తితో పొడిచి హతమార్చినట్లు సోమవారం ఉదయం సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మౌనిక లొంగిపోయింది. దీంతో ఆమెను రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ సీతారాం తెలిపారు.



Updated Date - 2021-11-09T15:02:58+05:30 IST