అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చంపేసి.. సంచిలో కుక్కి...!
ABN , First Publish Date - 2021-06-20T18:31:29+05:30 IST
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తమకు అడ్డువస్తున్నాడని
- వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హత్య
- రెండు వారాల తర్వాత వెలుగులోకి..
- నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ/స్టేషన్ఘన్పూర్ : వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తమకు అడ్డువస్తున్నాడని ఓ యువకుడిని హత్య చేసిన దారుణ సంఘటన రెండు వారాల తర్వాత బయటపడింది. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం స్టేషన్ఘన్పూర్ ఏఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్ విలేకరులకు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన యువకుడు (26) ఉప్పల్లో పెట్రోల్ పంప్లో పని చేస్తున్నాడు. అతడికి మూడు సంవత్సరాల క్రితం ఓ యువతితో వివాహమైంది. వీరికి ఏడు నెలల బాబు ఉన్నాడు. సదరు యువతికి వివాహం కాకముందు ఉప్పల్లో ఆటో నడుపుతున్న స్టేషన్ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన పసుల కుమార్తో పరిచయం ఉంది.
అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహమైన తర్వాత కుమార్ యువతి భర్తతో పరిచయం పెంచుకొని తరుచుగా వారి ఇంటికి వచ్చి, ఆమెతో చనువుగా ఉండేవాడు. గమనించిన ఆమె భర్త ఆమెను పలుమార్లు మందలించాడు. దీంతో ఇద్దరు కలిసి ఆ యువకుడి అడ్డుతొలగించుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో కుమార్ ఈ నెల 5న యువకుడిని తమ గ్రామానికి వెళ్లివద్దాం అని చెప్పి ఘన్పూర్కు తీసుకువచ్చాడు. అదే సమయంలో కుమార్ తన బావమరిది అయిన స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన పాలెపు కృష్ణను వెంటబెట్టుకొని వచ్చాడు. అదే రోజు రాత్రి ఘన్పూర్లో మద్యంతోపాటు ఆహారం పార్సిల్ తీసుకొని వచ్చి నమిలిగొండ గ్రామ శివారులో బస చేశారు.
పధకం ప్రకారం ముగ్గురు మద్యం తాగి, భోజనం చేసి అక్కడే పడుకున్నారు. ఆ తర్వాత కుమార్ లేచి ఓ బండరాయితో ఆ యువకుడి తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్, అతని బావమరిది కలిసి మృతదేహాన్ని సంచిలో కుక్కి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేసి వెళ్లిపోయారు. మరోవైపు తనపై అనుమానం రావద్దని హతుడి భార్య తన భర్త కనిపించడం లేదని ఈ నెల 8న ఘట్కేసర్ పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై సుధాకర్ విచారణ చేపట్టారు. మహేష్ ఫోన్ డేటా ఆధారంగా ట్రేస్ చేసి సిబ్బందితో కలిసి ఘన్పూర్కు వచ్చారు. స్థానిక సీఐ శ్రీనివా్సరెడ్డి, ఎస్సై రమే్షనాయక్తో కలిసి నిందితులు పాలెపు కృష్ణ, పసుల కుమార్ను పట్టుకొని విచారణ జరుపగా నేరం ఒప్పుకున్నారు. మృతదేహాన్ని బావిలో నుంచి వెలికి తీసి కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడే పోస్టుమార్టం చేసి అప్పగించారు.