కరోనా నివారణకు తోడ్పాటునందిస్తా..!
ABN , First Publish Date - 2021-06-22T06:28:33+05:30 IST
కొవిడ్ థర్డ్ వేవ్ పొంచి ఉన్న దృష్ట్యా కనిగిరిలో కరోనా నివారణకు తనవంతు తోడ్పాటు నందిస్తానని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్కు విన్నవించారు.
- కనిగిరిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం
- టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఉగ్ర
కనిగిరి, జూన్ 21: కొవిడ్ థర్డ్ వేవ్ పొంచి ఉన్న దృష్ట్యా కనిగిరిలో కరోనా నివారణకు తనవంతు తోడ్పాటు నందిస్తానని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్కు విన్నవించారు. జిల్లాలోని పలువురు టీడీపీ నేతలతో సోమవారం కలెక్టరేట్లో ప్రవీణ్కుమార్ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కనిగిరిలో ఉగ్ర మాట్లాడుతూ కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. మరలా థర్డ్ వేవ్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం చర్యలు తీసుకుని అప్రమత్తం అయితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. ఇందులో భాగంగా కనిగిరి ప్రాంతంలో ప్రజలు ఆక్సిజన్ కొరత కారణంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గానూ తన వంతు బాధ్యతగా అవసరమైతే కనిగిరిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు డాక్టర్ ఉగ్ర కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. డాక్టర్ ఉగ్ర వెంట నూకసాని బాలాజి, దామచర్ల జనార్దన్ తదితరులు ఉన్నారు.