పశువైద్యశాల ఏర్పాటయ్యేనా?
ABN , First Publish Date - 2022-05-26T05:47:47+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. నారాయణరావుపేట మండలంలో పది గ్రామ పంచాయతీలు, నాలుగు మధిర గ్రామాలు ఉన్నాయి.
14 గ్రామాలకు ఒకటే ఉప కేంద్రం
పశువైద్యశాల, మరో ఉప కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితం
మూగజీవాలకు అందని వైద్యం
ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు
నారాయణరావుపేట, మే 25: గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యం అందని ద్రాక్షగా మారుతోంది. నారాయణరావుపేట మండలంలో పది గ్రామ పంచాయతీలు, నాలుగు మధిర గ్రామాలు ఉన్నాయి. మండలాల పునర్విభజనలో గుర్రాలగొంది పశువైద్య ఉప కేంద్రం ఒక్కటే మిగిలింది. మండలంలోని 14 గ్రామాలకు ఈ ఉప కేంద్రం ఒకటే దిక్కైంది. మండల వ్యాప్తంగా 4,210 పశువులు, 30,800 గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఒకే ఒక్క జేవీవో, గోపాలమిత్రతో నెట్టుకొస్తున్నారు. అయితే కొన్నిరోజుల క్రితం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రాథమిక పశువైద్యశాల, మరో ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సభ్యులు తీర్మానించి పశు సంవర్ధక శాఖ అధికారులకు పంపించారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
మంత్రి హరీశ్రావు సహకారంతో నిర్మించిన మండలంలోని జక్కాపూర్, ఇబ్రహీంపుర్ గ్రామాల్లోని పశువుల హాస్టళ్లను ప్రారంభించారు. గుర్రాలగొంది గ్రామంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ పశువుల హాస్టళ్లను పశు వైద్య సిబ్బంది ప్రతీరోజూ సందర్శించాల్సి ఉంటుంది. కానీ పశువైద్య ఉప కేంద్రంలో జేవీవో, గోపాలమిత్ర ఇద్దరే పనిచేస్తుండంతో వాటిని సందర్శించేంత సమయం ఉండడం లేదు. దీంతో అనోరోగ్యానికి గురైన పశువులకు వైద్యమందక మృతి చెందుతున్నాయి. పశువైద్య కొరతతో రైతులు తమ పశువులను ప్రైవేటు సిబ్బంది లేదా సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు, చింతమడక ప్రాథమిక పశువైద్య కేంద్రాలకు తీసుకెళ్తున్నారు.